Ferozepur jail: ఈ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ చేసిన ఘోరాలివే...
ABN , First Publish Date - 2022-11-11T16:53:52+05:30 IST
జైలులోని ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లకు డ్రగ్స్, మొబైల్స్ సరఫరా చేస్తూ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ఒకరు పట్టుబడ్డారు
చండీగఢ్: జైలులోని ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లకు డ్రగ్స్, మొబైల్స్ సరఫరా చేస్తూ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ఒకరు పట్టుబడ్డారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్ (Ferozepur) జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ గురుచరణ్ సింగ్ (Gurcharan Singh) జైలులోని గ్యాంగ్స్టర్లు, టెర్రరిస్టులు, ఖైదీలకు మొబైల్ ఫోన్లు (Mobile Phones), డ్రగ్స్(Drugs) సరఫరా చేస్తున్నట్టు పక్కా సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు గురుచరణ్ సింగ్ను అరెస్ట్ చేశారు. జైలులోని హై సెక్యూరిటీ జోన్లో ఉన్న ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లు, డ్రగ్ స్మగ్లర్లకు నెల రోజులుగా ఆయన ఐదు మొబైల్ ఫోన్లు అందించారని, అందుకు బదులుగా వారి నుంచి డబ్బులు తీసుకున్నట్టు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) సురేంద్ర లింబా తెలిపారు. గురుచరణ్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఫిరోజ్పూర్ జైలు నుంచి గత రెండేళ్లలో 500కుపైగా ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జైలు భద్రతలో లొసుగులు ఖైదీలకు వరంగా మారాయి. వాటిని ఉపయోగించుకుని బయటి నుంచి ఫోన్లు, డ్రగ్స్ తెప్పించుకుని జైలులో దర్జాగా కాలం గడుపుతున్నారు. జైలు నుంచే దందాలు నడుపుతున్నారు. ఒక్క గతేడాదిలోనే దాదాపు 300 ఫోన్లను ఖైదీల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మే 29న జరిగిన గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య కేసులో అరెస్ట్ అయి ప్రొడక్షన్ వారెంట్పై ఉన్న గ్యాంగ్స్టర్ మన్ప్రీత్ సింగ్ అలియాస్ మన్నా నుంచి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్తో అతడు నిత్యం టచ్లో ఉంటున్నట్టు జైలు అధికారులు తెలిపారు.