మాజీ పైలట్ కనుసన్నల్లో డ్రగ్స్ రవాణా
ABN , First Publish Date - 2022-10-08T09:37:37+05:30 IST
ఎయిర్ ఇండియా మాజీ పైలట్ కనుసన్నల్లో నడుస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు ఛేదించారు.
60 కిలోల ఎండీ స్వాధీనం.. విలువ రూ.120 కోట్లు!
ముంబై, అక్టోబరు 7: ఎయిర్ ఇండియా మాజీ పైలట్ కనుసన్నల్లో నడుస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు ఛేదించారు. మాజీ పైలట్ సహా ఆరుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 60 కిలోల మెఫెడ్రోన్ (ఎండీ)ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.120 కోట్ల పైమాటే. గుజరాత్లోని జామ్నగర్ నౌకాదళ నిఘా విభాగం ఇచ్చిన సమాచారం మేరకు ఎన్సీబీ అధికారులు దాడులు నిర్వహించి 10 కిలోల ఎండీని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు. దర్యాప్తులో ముంబై స్థావరం గురించి తెలియడంతో.. గురువారం ముంబైలోని ఎస్బీ రోడ్డులో ఓ గోదాంలో 50 కిలోల ఎండీని గుర్తించారు. మాజీ పైలట్, ప్రధాన నిందితుడు సోహైల్ గఫార్ సహా మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. సోహైల్ గఫార్ ఎయిర్ ఇండియాలో పైలట్గా పనిచేశాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి డ్రగ్స్ వ్యాపారంలోకి దిగాడు.