Delhi Riots case: ఉమర్ ఖలిద్కు బెయిల్ నిరాకరణ
ABN , First Publish Date - 2022-10-18T22:48:36+05:30 IST
దేశ రాజధానిలో ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్ల వెనుక కుట్ర ఆరోపణలకు సంబంధించిన కేసులో..
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్ల వెనుక కుట్ర ఆరోపణలకు సంబంధించిన కేసులో జేఎన్యూ (JNU) మాజీ విద్యార్థి ఉమర్ ఖలిద్ (Umar Khalid)కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు మంగళవారంనాడు నిరాకరించింది. బెయిల్ విజ్ఞప్తి విచారణ యోగ్యంగా లేనందున తోసిపుచ్చుతున్నామని న్యాయమూర్తులు సిద్ధార్ధ్ మృదుల్, రజనీష్ భట్నాగర్లతో కూడిన ధర్మాసనం తెలిపింది.
ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసాకాండలో ప్రమేయంపై ఉమర్ ఖలిద్ను 2020 సెప్టెంబర్లో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ కేసులో తనకు ఎలాంటి క్రిమినల్ పాత్ర కానీ, కుట్ర సంబంధిత పాత్ర కానీ లేదని, తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు ఖలిద్ విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన బెయిల్ అభ్యర్థనను ఢిల్లీ పోలీసులు వ్యతిరేకించారు. 2020 ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లలోపై 53 మంది మృతి చెందగా, 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో ఖలిద్, షర్జీల్ ఇమామ్ సహా పలువురిపై ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సీఏఏ, ఎన్అర్సీ వ్యతిరేకంగా జరిగిన అల్లర్లు సందర్భంగా ఈ హింసాకాండ చెలరేగింది.