Electric bike taxi: మా కడుపులు కొట్టొద్దు..
ABN , First Publish Date - 2022-12-30T12:37:42+05:30 IST
ఆటోడ్రైవర్ల ఉపాధికి గండికొడుతున్న కర్ణాటక ఎలక్ట్రిసిటీ బైక్ ట్యాక్సీ పథకం 2021ను రద్దుచేయాల
- విద్యుత్ బైక్ ట్యాక్సీ పథకాన్ని రద్దు చేయాలని ఆటో డ్రైవర్ల డిమాండ్
బెంగళూరు, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆటోడ్రైవర్ల ఉపాధికి గండికొడుతున్న కర్ణాటక ఎలక్ట్రిసిటీ బైక్ ట్యాక్సీ పథకం 2021ను రద్దుచేయాలని బెంగళూరు ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల సమాఖ్య డిమాండ్ చేసింది. బెంగళూరులోని ఫ్రీడం పార్కులో తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆటో డ్రైవర్లు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ (సిఐటియు) అధ్యక్షుడు సిఎన్.శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. బెంగళూరు నగరంలో గత 60 సంవత్సరాలుగా ఆటో రిక్షాలు ప్రతిరోజూ 40 లక్షల మంది ప్రయాణీకులకు సేవలందిస్తున్నాయని వీటి పై ఆధారపడి 10 లక్షల మంది ఆటోలపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. విద్యుత్ బైక్ ట్యాక్సీ పథకం, వైట్ బోర్డు బైక్ ట్యాక్సీలకు అనుమతితో తమ కడుపుకొట్టవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. పెట్రోల్, డీజెల్, గ్యాస్ల ధరలు పెరిగినా తాము మీటర్ చార్జీలను పెంచకుండా ప్రయాణీకులకు నిస్వార్ధంగా సేవలందిస్తున్నామని కరోనా కష్టాల నుంచి ఇపుడిపుడే బయటపడుతున్న తరుణంలో తమ ఉపాధిని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతుండటం చాలా బాధగా ఉందన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.