Udayanidhi: డీఎంకే జిల్లా కార్యదర్శులుగా 21 మంది ఉదయనిధి అనుచరులు?
ABN , First Publish Date - 2022-09-27T15:27:15+05:30 IST
డీఎంకే సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి(Udayanidhi) అనుచరులైన 21
- డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పదవికి ఐదుగురి పోటీ
చెన్నై, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): డీఎంకే సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి(Udayanidhi) అనుచరులైన 21 మందిని జిల్లా శాఖ కార్యదర్శులుగా నియమించేందుకు రంగం సిద్ధమైంది. డీఎంకేలో 72 జిల్లాశాఖలకు కార్యదర్శులను ఎన్నుకునేందుకు మూడు రోజులపాటు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సోమవారం నుంచి దరఖాస్తుల పరిశీలన ప్రారంభమైంది. ఈ పదవులకు 18 మందికిపైగా మంత్రులు పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి యువతకు ప్రాధాన్యం కల్పించాలని ఉదయనిధి సూచించడంతో ఆయన నేతృత్వంలోని పార్టీ యువజన విభాగానికి చెందిన 21 మందిని జిల్లా శాఖ కార్యదర్శులుగా నియమించనున్నారు. ఇక డిప్యూటీ ప్రధాన కార్యదర్శులుగా మంత్రులు పెరియసామి, పొన్ముడి, ఎ.రాజా, అందియూరు సెల్వరాజ్కు మళ్ళీ నియమించనున్నారని తెలుస్తోంది. వీరితోపాటు డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా దశాబ్దాలుగా సేవలందించిన సుబ్బులక్ష్మి జగదీశన్ పార్టీ నుంచి వైదొలిగారు. దీనితో ఆమె స్థానంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా డీఎంకే ఎంపీ కనిమొళిని నియమిస్తారని ఊహాగానాలు చెలరేగాయి. కనిమొళి ఆ పదవికి ఆసక్తి చూపటం లేదని తెలిసిన మీదట ఐదుగురు మహిళలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రేసులో మాజీ ఎంపీ హెలెన్ డేవిడ్సన్, డాక్టర్ కనిమొళి, భవానీ రాజేంద్రన్, పుదుకోటకు చెందిన విజయ, సత్యా పళనికుమార్ ఉన్నారని తెలుస్తోంది. ఈ నెల 30న పదవుల ఎంపికకు సంబంధించిన జాబితాను డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారంగా ప్రకటించనున్నారు.