ధర్మాసనాల్లో భిన్నత్వం అవసరం

ABN , First Publish Date - 2022-10-02T09:41:18+05:30 IST

కోర్టుల్లో భిన్న నేపథ్యాలు కలిగిన న్యాయమూర్తులు ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు.

ధర్మాసనాల్లో భిన్నత్వం అవసరం

అన్ని ప్రాంతాలు, సంస్కృతులకు ప్రాతినిధ్యం: జస్టిస్‌ ఎన్వీ రమణ

న్యూఢిల్లీ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): కోర్టుల్లో భిన్న నేపథ్యాలు కలిగిన న్యాయమూర్తులు ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ధర్మాసనాల్లో భిన్నత్వం ఉండేలా చూడటానికి వ్యవస్థాగత యంత్రాంగం లేకపోవడం నిస్సందేహంగా ఒక సమస్యే అన్నారు. ధర్మాసనాల్లో వేర్వేరు నేపథ్యాల వారుంటే భిన్నమైన అభిప్రాయాలకు తావుంటుందని, తద్వారా వివిధ అనుభవాలు ఒకదగ్గర చేరతాయని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు. శనివారం ఆన్‌లైన్‌లో జరిగిన ఆసియన్‌ - ఆస్ట్రేలియన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ వార్షిక సాంస్కృతిక వైవిధ్య సదస్సులో ఆయన పాల్గొన్నారు.


‘‘సాంస్కృతిక వైవిధ్యం, న్యాయ వృత్తి’’ అనే అంశంపై మాట్లాడారు. రాజకీయ వ్యవస్థలోనే కాకుండా న్యాయ వ్యవస్థలోనూ వైవిఽధ్యానికి ప్రాతినిధ్యం కల్పించడంపై దృష్టిపెడుతున్న అతికొద్ది ప్రజాస్వామ్యాల్లో భారత్‌ ఒకటని అన్నారు. తాను ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో విభిన్నమైన నేపథ్యాలకు చెందినవారిని న్యాయమూర్తులుగా నియమించడానికి కృషి చేసినట్టు తెలిపారు. దేశానికి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి కూడా రాబోతున్నారని జస్టిస్‌ రమణ తెలిపారు. 

Updated Date - 2022-10-02T09:41:18+05:30 IST