Presidential Polls : ఎంపీలు, ఎమ్మెల్యేలకు వేర్వేరు రంగుల్లో బ్యాలట్ పేపర్లు

ABN , First Publish Date - 2022-07-15T22:00:45+05:30 IST

రాష్ట్రపతి ఎన్నికల (Presidential Polls) కోసం బ్యాలట్ పేపర్లను ఆకుపచ్చ,

Presidential Polls : ఎంపీలు, ఎమ్మెల్యేలకు వేర్వేరు రంగుల్లో బ్యాలట్ పేపర్లు

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల (Presidential Polls) కోసం బ్యాలట్ పేపర్లను  ఆకుపచ్చ, గులాబీ రంగుల్లో ముద్రించారు. ఓటు వేసే ఎంపీలకు ఆకుపచ్చ రంగు బ్యాలట్ పేపర్, ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలట్ పేపర్ ఇస్తారు. జూలై 18న పోలింగ్ జరుగుతుంది, జూలై 21న ఫలితాలు వెలువడతాయి. 


ఒక్కొక్క ఎంపీ (MP) ఓటు విలువ 700 కాగా, ఎమ్మెల్యే ఓటు విలువ సంబంధిత రాష్ట్ర జనాభానుబట్టి ఉంటుంది. ఓటు విలువనుబట్టి లెక్కించడానికి వీలుగా వేర్వేరు రంగుల్లో ఈ బ్యాలట్ పేపర్లను ఉపయోగిస్తున్నారు. అభ్యర్థుల పేర్లకు ఎదురుగా ఉన్న గడిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ప్రాధాన్యతను నమోదు చేయాలి.  ఎన్డీఏ (NDA) అభ్యర్థిగా ద్రౌపది ముర్ము (Draupadi Murmu), ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా (Yashwant Sinha) పోటీ పడుతున్నారు. 


ఎమ్మెల్సీలు, నామినేటెడ్ ఎంపీలు, నామినేటెడ్ ఎమ్మెల్యేలకు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు లేదు. పోలింగ్ సోమవారం పార్లమెంటు భవనం, రాష్ట్రాల శాసన సభ భవనాల్లో  జరుగుతుంది. 


ఎంపీల ఓటు విలువ గతంలో 708 ఉండేది. జమ్మూ-కశ్మీరులో శాసన సభ లేకపోవడంతో ఇది 700కు తగ్గిపోయింది. ఎమ్మెల్యేల ఓటు విలువ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యే ఓటు విలువ 208. జార్ఖండ్, తమిళనాడులకు చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యే ఓటు విలువ 176, మహారాష్ట్రలో ఇది 175, సిక్కింలో 7, నాగాలాండ్‌లో 9, మిజోరాంలో 8. 


Updated Date - 2022-07-15T22:00:45+05:30 IST