మంచుకొండల్లో మృత్యుఘోష

ABN , First Publish Date - 2022-07-09T07:58:57+05:30 IST

అమర్‌నాథ్‌ యాత్రికులపై ప్రకృతి కన్నెర్ర చేసింది. చుట్టూ ఉన్న కొండల్లోంచి ఆకస్మికంగా పోటెత్తిన వరద అమరనాథుడి గుహ ఎదుటే వాగులో సేదదీరుతున్న భక్తులపై అమాంతం వచ్చిపడింది.

మంచుకొండల్లో మృత్యుఘోష

అమర్‌నాథ్‌ గుహ ఎదుటే వరద బీభత్సం.. 15 మంది దుర్మరణం


40 మంది గల్లంతు, కొందరికి గాయాలు

మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం!

కొండల మీద గంటపాటు భీకర వర్షం

దాంతో క్షణాల్లో పోటెత్తిన వాగులు

కొట్టుకుపోయిన టెంట్లు, వంటశాలలు

హెలికాప్టర్లలో క్షతగాత్రుల తరలింపు

మార్గం ధ్వంసం.. నిలిచిపోయిన యాత్ర

రాష్ట్రపతి కోవింద్‌, ప్రధాని మోదీ విచారం


శ్రీనగర్‌, జూలై 8: అమర్‌నాథ్‌ యాత్రికులపై ప్రకృతి కన్నెర్ర చేసింది. చుట్టూ ఉన్న కొండల్లోంచి ఆకస్మికంగా పోటెత్తిన వరద అమరనాథుడి గుహ ఎదుటే వాగులో సేదదీరుతున్న భక్తులపై అమాంతం వచ్చిపడింది. మట్టి, బురదతో కలగలిసి సజీవ సమాధి చేసింది. కొందరు వరదలో కొట్టుకుపోయారు. మరికొందరు గాయాలపాలయ్యారు. పుణ్య క్షేత్రాన్ని దర్శనం చేసుకొని, అక్కడి ఆధ్యాత్మిక జ్ఞాపకాలను మూటగట్టుకొని తమ వాళ్లు సంతోషంగా ఇళ్లకు తిరిగొస్తారని ఆశలు పెట్టుకున్న వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. శుక్రవారం సాయంత్రం 5:30 సమయంలో ఉన్నట్టుండి కురిసిన అతి భారీ వర్షం ధాటికి దక్షిణ జమ్మూ కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ క్షేత్ర గుహ దగ్గర్లోని బేస్‌ క్యాంప్‌ ప్రాంతం అతలాకుతలమైంది.


ఎగువ నుంచి పోటెత్తిన వరద ఉధృతికి భక్తుల కోసం ఏర్పాటు చేసిన 25 టెంట్లు, మూడు సామూహిక వంటగదులు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా 15 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. పోటెత్తిన వరదలో 40 మంది కొట్టుకుపోయి గల్లంతయ్యారు. ఫలితంగా మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.  క్షతగాత్రులను ప్రత్యేక హెలికాప్టర్లలో ఎక్కించుకొని బేస్‌ క్యాంప్‌ ఆస్పత్రులకు తరలించారు. అతి భారీ వర్షం ఽధాటికి యాత్రా మార్గం ధ్వంసమవడంతో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు (ఐటీబీపీ),  జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌) సభ్యులు హుటాహుటిన  సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం వెతుకుతున్నారు.


ఈ ఘటన పట్ల రాష్ట్రపతి కోవింద్‌, ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత భక్తులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయని భరోసా ఇచ్చారు. ఘటన వివరాలపై మోదీకి జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ఫోన్లో వివరించారు. కాగా ప్రభావిత ప్రాంతాల్లో అత్యంత వేగవంతంగా సహాయక చర్యలను చేపట్టాలని కేంద్రబలగాలు, జమ్మూ కశ్మీర్‌ యంత్రాంగానికి హోంమంత్రి అమిత్‌ షా అదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై తాను జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాతో మాట్లాడినట్లు, ఎన్డీఆర్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, బీఎ్‌సఎఫ్‌ బలగాలు సహాయక చర్యలకు దిగినట్లు ట్విటర్‌లో అమిత్‌ షా వెల్లడించారు. ‘‘భక్తుల ప్రాణాలు కాపాడటమే మా తొలి ప్రాధాన్యం.


భక్తులందరూ క్షేమంగా ఉంటారనే ఆశిస్తున్నాను’’ అని ట్విటర్‌లో ఆయన రాశారు. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి అమర్‌నాథ్‌ గుహ వైపు వరద పోటెత్తిందని ఇండో-టిబెటన్‌ సరిహద్దు దళానికి చెందిన ఓ అధికారి వెల్లడించారు. వర్షం ఇంకా కురుస్తూనే ఉన్నా పరిస్థితి అదుపులో ఉందని, యాత్రను మాత్రం తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్పారు. భారీ వర్షం, వరద పోటు మొదలైన 10-15 నిమిషాల్లోనే అధికారులు సహాయక చర్యలకు దిగినట్లు, ఫలితంగా కొందరు భక్తులకు ప్రమాదం తప్పినట్లు చెబుతున్నారు. తమవారి ఆచూకీ తెలుసుకునేందుకు హెల్ఫ్‌లైన్‌ నంబర్లు (ఎన్డీఆర్‌ఎఫ్‌: 011-23438252, 011-23438253; కశ్మీర్‌ డివిజనల్‌ హెల్ప్‌లైన్‌: 0194-249640; పుణ్యక్షేత్ర బోర్డు హెల్ఫ్‌లైన్‌: 011-2313149) ఏర్పాటు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వెల్లడంతో ఇప్పుడు ఆ కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కరోనా ప్రభావంతో రెండేళ్లుగా నిలిచిపోయిన అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 30న మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 72వేల మంది స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. వాతావరణం బాగోలేదని మూడు రోజుల క్రితం యాత్రను నిలిపేశారు. వాతావరణం మెరుగుపడటంతో ఒక రోజులోనే తిరిగి పునః ప్రారంభించారు.


శ్రీనగర్‌ వద్ద నిలిపేశారు

అశ్వారావుపేట రూరల్‌, జూలై 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎంపీపీ, టీఆర్‌ఎస్‌ నాయకుడు జల్లిపల్లి శ్రీరామమూర్తితో పాటు మరో ఆరుగురు.. ఇతర ప్రాంతాలకు చెందిన 40మందితో కలిసి ఐదు రోజుల క్రితం అమర్‌నాథ్‌ యాత్రకు బయలుదేరి వెళ్లారు. పోలీసులు వారిని శ్రీనగర్‌కు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలోనే నిలిపివేశారు. వీరంతా క్షేమంగానే ఉన్నారు.


సిద్దిపేట లంగర్‌ సురక్షితం

అమర్‌నాథ్‌ వరద బీభత్సం సిద్దిపేటలో కలకలం రేపింది. ఇటీవలే సిద్దిపేటకు చెందిన అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అమర్‌నాథ్‌ యాత్ర సమీపంలోని బాల్తాల్‌ బేస్‌క్యాంపు వద్ద భారీ లంగర్‌ ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది భక్తులకు మూడు పూటలా భోజనం అందిస్తున్నారు. నిత్యం ఐదువేల మందికి పైగానే ఈ లంగర్‌కు వస్తుంటారు. లంగర్‌లో సేవ చేస్తున్న సిద్దిపేటకు చెందిన 20 మందితోపాటు భోజనానికి వచ్చిన భక్తులు సురక్షితంగా ఉన్నట్లు లంగర్‌ నిర్వాహకులు నేతి కైలాసం ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. వరద ప్రభావం గుహ వద్దనే ఉన్నదని, తమ లంగర్‌ ఉన్నచోట ప్రశాంతంగా ఉందని చెప్పారు. సిద్దిపేట అన్నదాన సేవా సమితి 12 ఏళ్ల నుంచి అమర్‌నాథ్‌లో లంగర్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2022-07-09T07:58:57+05:30 IST