Presidential poll: కఠిన నిబంధనలను జారీ చేసిన కాంగ్రెస్

ABN , First Publish Date - 2022-10-04T00:06:50+05:30 IST

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలను..

Presidential poll: కఠిన నిబంధనలను జారీ చేసిన కాంగ్రెస్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు (Congress presidential poll) సంబంధించిన నియమ నిబంధనలను (guidelines) ఆ పార్టీ సోమవారంనాడు విడుదల చేసింది. పోటీలో ఉన్న అభ్యర్థులకు పార్టీ ఆఫీస్ బేరర్లు ప్రచారం చేయరాదని హెచ్చరించింది. ఎవరైనా అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాలనుకుంటే ముందుగా వారు తమ సంస్థాగత పదవులకు రాజీనామా చేయాలని స్పష్టం  చేసింది. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఈ ఆదేశాలను జారీ చేసింది.


కాంగ్రెస్ అధ్యక్షుడి బరిలో పార్టీ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ పోటీ పడుతున్నారు. తమ వ్యక్తిగత హోదాలో వారు పోటీ చేస్తున్నారని, డిలెగేట్లు స్వేచ్ఛగా తమకు నచ్చిన వారికి బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయాలని పార్టీ తెలిపింది. అభ్యర్థుల ప్రచారంలో ఏఐసీసీ సెక్రటరీలు, ఇన్‌చార్జిలు, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్‌పీ నేతలు, పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ చీఫ్‌లు, ఆయా శాఖలు, సెల్స్ చీఫ్‌లు, అధికారిక ప్రతినిధులు పాల్గొనరాదని, ఒకవేళ ప్రచారం చేయాలనుకుంటే ముందుగా సంస్థాగత పదవులకు రాజీనామా చేయాలని తేల్చిచెప్పింది.


కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 17న జరుగనుంది. అక్టోబర్ 19న కౌంటింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల పోలింగ్‌లో 9,000 మందికి పైగా పీసీసీ డెలిగేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.


మర్యాదపూర్వకంగా వ్యవహరించొచ్చు...

అధ్యక్షుడి ఎన్నికలో పోటీ  చేస్తున్న వారు ఆయా రాష్ట్రాలకు వచ్చినప్పుడు సంబంధిత పీసీసీ అధ్యక్షులు వారిని మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకోవాలని, పీసీసీ డెలిగేట్స్‌తో సమావేశం జరపాలని వారు కోరుకుంటే మీటింగ్ హోల్, కుర్చీలు, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ ఎక్విప్‌మెంట్ వంటివి కల్పించాలని పీసీసీ అధ్యక్షులకు కాంగ్రెస్ సూచించింది. అయితే ఈ మీటింగ్‌లను పీసీసీ అధ్యక్షులు తమ వ్యక్తిగత హోదాలో మాత్రం నిర్వహించరాదని స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఓటర్లను రప్పించేందుకు వాహనాలను వాడటం కానీ, ప్రచార హంగామా కానీ చేయరాదని తెలిపింది. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే అభ్యర్థుల ఎన్నిక చెల్లదని ప్రకటించడంతో పాటు  క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా ఆ ఆదేశాల్లో పార్టీ హెచ్చరించింది. ఏ అభ్యర్థిపైనా దుష్ట్రచారం చేయరాదని, అందువల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుందని, ఎన్నికల పక్రియ సున్నితత్వానికి ఎలాంటి విఘాతం కలుగరాదని స్పష్టం చేసింది.

Updated Date - 2022-10-04T00:06:50+05:30 IST