Poll promises: ఎన్నికల కమిషన్‌కు ఏం పని : రాజకీయ పార్టీల మండిపాటు

ABN , First Publish Date - 2022-10-04T23:25:23+05:30 IST

ఎన్నికల వాగ్దానాలపై అన్ని వివరాలు ఓటర్లకు తప్పనిసరిగా

Poll promises: ఎన్నికల కమిషన్‌కు ఏం పని : రాజకీయ పార్టీల మండిపాటు

న్యూఢిల్లీ : ఎన్నికల వాగ్దానాలపై అన్ని వివరాలు ఓటర్లకు తప్పనిసరిగా తెలియాలని ఎన్నికల కమిషన్ (Election Commission) చెప్పడాన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ విధంగా జోక్యం చేసుకునే అధికారం ఈసీకి లేదంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే ఈ ప్రతిపాదన చేసిందని మండిపడుతున్నాయి. 


ఎన్నికల ప్రణాళికలు (Election Manifestos)లో రాజకీయ పార్టీలు చేసే వాగ్దానాలు, వాటి అమలుకు ఆర్థిక వనరులు వంటి అంశాల గురించి ఓటర్లకు తెలియాలని, అన్ని వివరాలను తెలుసుకుని, తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఇది దోహదపడుతుందని ఎన్నికల కమిషన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలను తెలియజేయాలని గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలను కోరింది. దీనిపై స్పందించేందుకు ఈ నెల 18 వరకు గడువు విధించింది. 


మీకేం పని : కాంగ్రెస్

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ మీడియాతో మాట్లాడుతూ, ఇది ఎన్నికల కమిషన్ చేయవలసిన పని కాదన్నారు. పోటీతత్త్వ రాజకీయాల సారం, స్పూర్తిలకు ఇది విరుద్ధమని ఆరోపించారు. భారత దేశ ప్రజాస్వామ్యంలో ఇది మరొక పొరపాటు అవుతుందని చెప్పారు. గతంలో ఇలాంటి బ్యూరోక్రాటిక్ వైఖరి ఉండి ఉంటే, దశాబ్దాల నుంచి పరివర్తన తీసుకొస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలేవీ వాస్తవమయ్యేవి కాదన్నారు. 


వారినీ జవాబుదారీ చేయాలి : శివసేన

శివసేన రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కార్యకలాపాలు గంపగుత్త తరహాకు మారుతున్నాయని, అదేవిధంగా ఎన్నికల ప్రజాస్వామ్యం, ఎన్నికల నిర్వహణ కూడా మసకబారుతోందని వ్యాఖ్యానించారు. ఓటర్లు తమ ఓటు ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకుంటారని, ఆ ప్రభుత్వాలు అధికంగా ఖర్చు చేస్తే, తమ వాగ్దానాలను నిలుపుకోలేకపోతే, వాటిని ఆ ఓటర్లే గద్దె దించుతారని అన్నారు. ఇది కేవలం ఓటర్ల హక్కు అని చెప్పారు. ఈసీ తన బాధ్యతలను అతిగా నిర్వహిస్తోందన్నారు. సుస్థిరమైన అంతర్జాతీయ నిబంధనలలో కేంద్ర ప్రభుత్వ ప్రోద్బలంతో జోక్యం చేసుకుంటోందని మండిపడ్డారు. 


అభివృద్ధి లక్ష్యాలపై గొప్పలు చెప్పుకుని అధికారం చేపట్టినవారిని, ఉద్యోగ కల్పన, అభివృద్ధిపై ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి బదులుగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని రోజులను పెంచినవారిని, ఉచిత రేషన్ స్కీమ్‌ను మరింత విస్తరించినవారిని కూడా ఈసీ జవాబుదారీ చేయాలన్నారు. 


Updated Date - 2022-10-04T23:25:23+05:30 IST