china troops: డ్రాగన్ తాజా వ్యూహం.. పాక్కు చైనా బలగాలు
ABN , First Publish Date - 2022-08-18T01:07:53+05:30 IST
న్యూఢిల్లీ: పాకిస్థాన్లో తాను చేపట్టిన ప్రాజెక్టుల్లో పని చేసే చైనీయులకు రక్షణ కల్పించేందుకు స్వయంగా తన ఆర్మీనే పంపాలని చైనా నిర్ణయించింది. ఇప్పటికే తమ జాతీయులను
న్యూఢిల్లీ: పాకిస్థాన్లో తాను చేపట్టిన ప్రాజెక్టుల్లో పని చేసే చైనీయులకు రక్షణ కల్పించేందుకు స్వయంగా తన ఆర్మీనే పంపాలని చైనా నిర్ణయించింది. ఇప్పటికే తమ జాతీయులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతుండటంతో డ్రాగన్ ఈ నిర్ణయం తీసుకుంది. పాక్లో చైనా రాయబారి నోంగ్ రోంగ్ పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్, విదేశాంగ బిలావల్ భుట్టో, ఆర్మీ చీఫ్ ఖమర్ జావెద్ బాజ్వాలతో సమావేశమై దీనిపై లోతుగా చర్చించారు. పాకిస్థాన్లో చైనా ప్రాజెక్టులు జరుగుతున్న గ్వాదర్, ఖుజ్దార్, హోషబ్, గిల్గిత్- బాల్టిస్థాన్ ప్రాంతాల్లో పీఎల్ఏ ఔట్పోస్ట్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. గ్వాదర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తమ సైనిక అవసరాల కోసం ఇవ్వాలని కూడా డ్రాగన్ పాకిస్థాన్పై ఒత్తిడి తెస్తోంది.
చైనా నుంచి 300 బిలియన్ డాలర్లకు పైగా అప్పు తీసుకున్న పాకిస్థాన్కు మరో మార్గం లేదు. ఆర్ధికంగా దివాళా తీసిన ప్రస్తుత పరిస్థితుల్లో చైనా మాట వినడం తప్ప షెబాజ్ షరీఫ్ సర్కారుకు మరో గత్యంతరం లేదు. దీనికి తోడు కోల్డ్వార్ సమయంలో పాక్ తన భూభాగాన్ని అమెరికా బలగాల కోసం ఇవ్వడాన్ని కూడా నోంగ్ రోంగ్ వారికి గుర్తు చేసినట్లు సమాచారం. చైనా ప్రతిపాదన ఓకే చేస్తే పాక్ జాతీయుల నుంచి వ్యతిరేకత వస్తోందనే ఆందోళన కూడా షరీఫ్ సర్కారులో ఉంది. దేశమంతా నెమ్మదిగా చైనా చేతుల్లోకి వెళ్తుందనే ఆందోళన పాక్ జాతీయుల్లే తలెత్తే అవకాశం ఉందని షెబాజ్ అనుమానిస్తున్నారు. అయితే భారత్కు చెక్ పెట్టాలనే దుష్ట తలంపుతో పాక్-చైనా ఈ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. త్వరలోనే చైనా బలగాలు పాకిస్థాన్లో ఔట్పోస్ట్లు ఏర్పాటు చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది.
అదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్ లోనూ తనకు ఇబ్బందులు లేకుండా చేసుకోవాలని చైనా యోచిస్తోంది. ప్రస్తుతం అనుకూలంగా ఉన్నా భవిష్యత్తులో తమకు చిక్కులు రాకుండా ఉండేలా చైనా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దీనికి తోడు ఆఫ్ఘన్ నుంచి భారతీయులను పంపించివేయడం, ఆఫ్ఘన్లో భారత్ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించాలని కూడా పాక్-చైనా యోచిస్తున్నాయి. అయితే తాలిబన్లు పాక్కు అనుకూలంగా ఉంటున్నా భారత్ ప్రభావాన్ని తగ్గించే విషయంలో తొందరపడకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
పాక్, ఆఫ్ఘనిస్థాన్లతో పాటు చైనా శ్రీలంకపై కూడా ఫోకస్ చేసింది. ఇప్పటికే డ్రాగన్ శ్రీలంకకు నిఘా నౌకను పంపి భారత్ను చిక్కుల్లో పడేసింది. భారత్ నుంచి పెద్ద ఎత్తున సాయం పొందుతున్నా చైనా నిఘా నౌకను అనుమతించడం ద్వారా శ్రీలంక విశ్వాసఘాతుకానికి పాల్పడినట్లుగా భారత అధికార వర్గాలు భావిస్తున్నాయి. భారత్ను నలువైపులా దిగ్బంధనం చేసేందుకు చైనా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.