Chennai: చిన్నారిని బలిగొన్న అనుమాన భూతం

ABN , First Publish Date - 2022-09-26T17:24:07+05:30 IST

భార్య శీలాన్ని శంకించి ఎనిమిదేళ్ల కుమార్తెను దారుణంగా హత్య చేసిన కసాయి తండ్రి ఆచూకీ కోసం మదురై పోలీసులు గాలిస్తున్నారు..

Chennai: చిన్నారిని బలిగొన్న అనుమాన భూతం

భార్య శీలాన్ని శంకించి కుమార్తెను హత్య చేసిన ప్రబుద్ధుడు

చిన్నారిని బలిగొన్న అనుమాన భూతం

చెన్నై: భార్య శీలాన్ని శంకించి ఎనిమిదేళ్ల కుమార్తెను దారుణంగా హత్య చేసిన కసాయి తండ్రి ఆచూకీ కోసం మదురై పోలీసులు గాలిస్తున్నారు. మదురై  జైహింద్‌పురంలో కాళిముత్తు (42), ప్రియదర్శిని అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరికి తనిష్క (8) అనే కుమార్తె ఉంది. కాళిముత్తు దర్జీ దుకాణం నడుపుతున్నాడు. ప్రియదర్శిని ప్రైవేటు సంస్థలో సేల్స్‌ ఉమన్‌గా పనిచేస్తోంది. ఇద్దరూ ప్రతిరోజూ ఉదయం ఇంటి నుంచి వెళ్ళి రాత్రి తిరిగివచ్చేవారు. ఇటీవల కాళిముత్తుకు భార్య శీలంపై అనుమానం ఏర్పడింది. దీనికితోడు తన కుమార్తె తనిష్కకు తనది గాని,, భార్య పోలిక గాని లేదనే అనుమానం కూడా తోడైంది. ఈ నేపథ్యంలో రోజూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో ఈ నెల మూడున కాళిముత్తు, కుమార్తెను వెంటబెట్టుకుని శివగంగలో ఉన్న తన సోదరి ఇంటికి వెళ్ళాడు. వారం తర్వాత కాళిముత్తు ఇంటికి తిరిగి వచ్చాడు. ప్రియదర్శిని కుమార్తె కోసం ప్రశ్నించగా తన సోదరి ఇంటిలో ఉందని, వారం రోజుల తర్వాత తీసుకువస్తానని చెప్పాడు. మూడురోజు క్రితం ప్రియదర్శిని భర్త కాళిముత్తుతో కలిసి మేలూరులో ఉన్న తన సోదరి ఇంటికి వెళ్ళింది. శనివారం భార్యాభర్తలు తిరిగి వస్తున్నప్పుడు కాళిముత్తు తన సోదరి ఇంటికి వెళ్తానని చెప్పాడు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న ప్రియదర్శినికి చుట్టుపక్కల నివసిస్తున్నవారు వారింటి నుంచి దుర్వాసన వస్తుందని ఫిర్యాదు చేశారు. దీంతో ప్రియదర్శిని ఇంటిలోని పాతసామాన్లు భద్రపరిచే గదిలోనే దుర్వాసన వస్తుందని గుర్తించింది.


ఆ గదిలోని ఓ ప్లాస్టిక్‌ బకెట్‌పై పాలిథిన్‌ కాగితాలు చుట్టి ఉండడం గమనించి దానిని తెరచింది. ఆ బకెట్‌లో తాను అల్లారుముద్దుగా పెంచిన కుమార్తె తనిష్క కుళ్ళిన స్థితిలో శవంగా పడి ఉండటం చూసి  దిగ్ర్భాంతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపారు. పోలీసుల విచారణలో కాళిముత్తు పది రోజులకు ముందే కుమార్తె గొంతునులిమి హత్య చేసి శవాన్ని ప్లాస్టిక్‌ బకెట్‌లో దాచి ఉంచాడని వెల్లడైంది. ఈ విషయం తెలియని ప్రియదర్శిని కుమార్తె శవం ఉన్న ఇంటిలోనే తిరిగింది.  ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాళిముత్తు ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Updated Date - 2022-09-26T17:24:07+05:30 IST