Chennai: మంచు పరదాల మాటున నగరాలు

ABN , First Publish Date - 2022-11-29T10:59:09+05:30 IST

బంగాళాఖాతంలో ఇటీవల రెండు అల్పవాయుపీడనాలు కేంద్రీకృతమై బలహీనపడి తేలికపాటి జల్లులు మాత్రమే కురియటంతో చెన్నై, పరిసర జిల్లాల్లో

Chennai: మంచు పరదాల మాటున నగరాలు

- అరక్కోణం వైపు నెమ్మదిగా నడిచిన రైళ్లు

చెన్నై, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఇటీవల రెండు అల్పవాయుపీడనాలు కేంద్రీకృతమై బలహీనపడి తేలికపాటి జల్లులు మాత్రమే కురియటంతో చెన్నై, పరిసర జిల్లాల్లో చలిగాలులు అధికమై వేకువజామున దట్టమైన మంచు కురుస్తోంది. మూడు రోజుల క్రితం నగరంలో పొగమందు అధికమైన విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సోమవారం వేకువజామున తిరువళ్లూరు, కాంచీపురం(Tiruvallur, Kancheepuram) జిల్లాల్లో దట్టమైన పొగమంచు అలముకుంది. రైలు పట్టాలు కూడా కనిపించనంతగా మంచు దట్టంగా కురియడంతో చెన్నై నుంచి అరక్కోణం వైపు వెళ్లే రైళ్లన్నీ ఉదయం ఏడున్నర గంటల వరకూ వేగాన్ని తగ్గించి నెమ్మదిగా నడిపారు. విద్యుత్‌ లోకల్‌ రైళ్లు కూడా నత్తనడక నడపడంతో ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు కంపెనీల ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు నెమ్మదిగా నడచిన రైళ్ల కారణంగా సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోక ఇబ్బందులపాలయ్యారు. కాంచీపురం, వాలాజాబాద్‌, ఉత్తిరమేరూరు ప్రాంతాల్లో వేకువజాము దట్టంగా పొంగమంచు వ్యాపించడంతో వాహన చోధకులు ఇబ్బందులకు గురయ్యారు. కాంచీపురంలోని మూంగిల్‌ మండపం, కామరాజర్‌ సాలై, బస్‌స్టేషన్‌, గంగైకొండాన్‌ మండపం తదితర ప్రాంతంలో మంచు కారణంగా వాహనచోధకులకు రహదారులు కనిపించలేదు. దీనితో హెడ్‌లైట్లు వేసుకుని వారంతా వాహనాలను నడపాల్సి వచ్చింది.

Updated Date - 2022-11-29T10:59:11+05:30 IST