4 వేల లగ్జరీ కార్లు బుగ్గి
ABN , First Publish Date - 2022-02-19T08:53:58+05:30 IST
సుమారు నాలుగు వేల లగ్జరీ కార్లతో ఓ భారీ సరకు రవాణా నౌక.. జర్మనీ నుంచి బయలుదేరింది. ....
భారీ నౌక అగ్గిపాలు.. 22 మంది సిబ్బంది క్షేమంగా తీరానికి
పోర్చుగల్ సమీపంలో ప్రమాదం
టెర్సిరా, ఫిబ్రవరి 18: సుమారు నాలుగు వేల లగ్జరీ కార్లతో ఓ భారీ సరకు రవాణా నౌక.. జర్మనీ నుంచి బయలుదేరింది. అంతా సవ్యంగా జరిగి ఉంటే.. ఫిబ్రవరి 23న అమెరికాలోని డెవి్సవిల్లే తీరాన్ని చేరాల్సిన ఈ నౌక.. భారీ అగ్ని ప్రమాదానికి గురైంది. మహా సముద్రం మధ్యలో నిలువునా తగలిబడిపోతోంది. పోర్షే, బెంట్లీ, ఆడీ, లంబోర్గిణి లాంటి ఖరీదైన లగ్జరీ కార్లతో.. ఫిబ్రవరి 10న బయలుదేరిన ‘ఫెలిసిటీ ఏస్’ నౌకలో బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అట్లాంటిక్ మ హా సముద్రంలో ప్రయాణిస్తున్న ఈ నౌక.. ఆ సమయంలో పోర్చుగల్కు చెందిన టెర్సిరా ద్వీపానికి 200 మైళ్ల దూరంలో ఉంది. మూడు ఫుట్బాల్ స్టేడియాల పరిమాణంలో ఉండే ఈ భారీ నౌక.. మూడు రోజులుగా తగలబడుతూనే ఉంది. ఆస్తి నష్టం భారీగా సంభవించినా ప్రాణనష్టం మాత్రం తప్పింది. నౌకలోని మొత్తం 22 మంది సిబ్బందినీ పోర్చుగల్ రెస్క్యూ బృం దాలు సురక్షితంగా తీరం చేర్చాయి. మంటలు ఆర్పి ఈ నౌకను తీరం చేర్చే దిశగా పోర్చుగల్ నేవీ, వాయుసేనల తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే.. అగ్ని ప్రమాదానికి కారణాలు, ఆస్తి నష్టం వివరాలు వెల్లడి కాలేదు. సుమా రు 4 వేల కార్లు ఆ నౌకలో ఉన్నట్లు ఫోక్స్వ్యాగన్ అంచనా వేయగా.. 189 బెంట్లే కార్లతో పాటు 11 వందలు పోర్షే కార్లు కూడా ఉన్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. మిగిలిన కార్ల కంపెనీలు మాత్రం ప్రమాదంపై స్పందించలేదు.