హైదరాబాద్ ఆర్చిబిషప్ ఆంథోనీ పూలాకు కార్డినల్ హోదా
ABN , First Publish Date - 2022-05-30T08:15:34+05:30 IST
హైదరాబాద్కు చెందిన ఆర్చిబిషప్ ఆంథోనీ పూలాకు కార్డినల్ హోదా లభించింది.
గోవా ఆర్చిబిష్పకు కూడా..
ప్రకటించిన పోప్ ఫ్రాన్సిస్
ఈ గౌరవం దక్కిన తొలి తెలుగు వ్యక్తి పూలా
వాటికన్ సిటీ, మే 29: హైదరాబాద్కు చెందిన ఆర్చిబిషప్ ఆంథోనీ పూలాకు కార్డినల్ హోదా లభించింది. పోప్ తర్వాత ఉన్నత స్థానంగా భావించే కార్డినల్ హోదాకు హైదరాబాద్ నుంచి ఎంపికైన తొలి ఆర్చిబిషప్ ఆంథోనీ పూలానే. ఈ గౌరవం దక్కించుకున్న తొలి తెలుగు ఆర్చిబిషప్ కూడా ఆయనే. ‘‘దేవుని కృపతో చరిత్రలో మొదటిసారి తెలుగు ఆర్చిబిష్ప కు కార్డినల్ హోదా లభించింది. చర్చి పట్ల ఆంథోనీ పూలా నిబద్ధత, అంకితభావం, సేవకు దక్కిన గొప్ప గౌరవం ఇది. చర్చి గురించి ఆయనకు చాలా లోతైన ఆలోచనలు ఉన్నాయి’’ అని తెలుగు క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్ డిప్యూటీ సెక్రటరీ జోసెఫ్ ఆర్లగడ్డ అన్నారు. ఆంథోనీ పూలా కర్నూలు జిల్లాలోని చిందుకూరు గ్రామంలో జన్మించారు. కర్నూలు, బెంగళూరులోని సెమినరీల్లో చదువుకున్నారు. ఏపీ సోషల్ సర్వీస్ సొసైటీ యూత్ కమిషన్కు చైర్మన్గా సేవలందించారు. తెలుగు క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ సెక్రటరీ జనరల్గా, ట్రెజరర్గా వ్యవహరించారు. ప్రస్తుతం హైదరాబాద్ ఆర్చిబిష్ప గా ఉన్నారు. హైదరాబాద్తోపాటు రంగారెడ్డి, మేడ్చల్, ఆదిలాబాద్, కడప, ఖమ్మం, కర్నూలు, నల్లగొండ, వరంగల్ తదితర జిల్లాల పరిధిలో సేవలందిస్తున్నారు. భారత్ నుంచి ఆంథోనీ పూలాతోపాటు గోవాకు చెందిన మరో ఆర్చిబిషప్ రోసారియో ఫెరావోకు కార్డినల్ హోదా లభించింది. వీరిద్దరితోపాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 21 మందికి కార్డినల్ హోదా కల్పిస్తున్నట్టు పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం ప్రకటించారు. ఆగస్టు 27న జరిగే ప్రత్యేక కార్యక్రమంలో కార్డినల్స్ బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే.. పోప్ ఎన్నికల్లో కార్డినల్స్ కీలకంగా వ్యవహరిస్తారు. భారత్కు చెందిన ఓస్వాల్డ్ గ్రేసియస్ ఇప్పటికే కార్డినల్గా, పోప్ సలహాదారుల్లో ఒకరిగా ఉన్నారు. తాజాగా మరో ఇద్దరు ఎంపిక కావడంతో భవిష్యత్తులో భారతీయులు పోప్గా ఎన్నికయ్యే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.