Nupur Sharma కి బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ మద్దతు
ABN , First Publish Date - 2022-07-06T02:08:06+05:30 IST
మహ్మద్ ప్రవక్త(Prophet Muhammad)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీ(BJP) మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ
న్యూఢిల్లీ : మహ్మద్ ప్రవక్త(Prophet Muhammad)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీ(BJP) మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ(Nupur Sharma)కు పశ్చిమబెంగాల్(West Bengal) బీజేపీ నేత, ఎంపీ దిలీప్ ఘోష్(Dilip Ghosh) మద్దతు పలికారు. నూపుర్ శర్మ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులను తప్పుబట్టారు. హింసాత్మక ఘటనల వెనుకున్న భావజాలాన్ని(ideology ) ఆయన విమర్శించారు. స్వాతంత్ర్యానికి పూర్వం కూడా ఈ తరహా అల్లర్లు జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, అయితే హింసాత్మక ఘటనల వెనుకున్న సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ప్రపంచం భయపడిందని ఆయన అన్నారు. నూపుర్ శర్మ చెప్పినది తప్పని భావించేవారు వచ్చి వాదన చేయాలని, టీవీ డిబేట్లో కారణాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నూపుర్ శర్మ మాట్లాడిన దాంట్లో తప్పేంటో చెప్పకుండా.. కత్తులు దూస్తున్నారని దిలీప్ ఘోష్ అన్నారు.
వివాదాస్పద ‘కాళీ’ పోస్టర్(Kaali Poster)పై ప్రశ్నించగా దిలీప్ ఘోష్ స్పందించారు. తాము ప్రగతిశీల, సెక్యూలర్ వ్యక్తులమని చెప్పుకునేందుకు కొంతమంది హిందుత్వాన్ని తిడుతుంటారని ఆయన అన్నారు. కాళీ మాత సిగరెట్ తాగుతున్నట్టు పోస్టర్ విడుదల చేయడం కూడా ఇలాంటిదేనని ఆయన అభివర్ణించారు. వారి గురించి జనాలు మాట్లాడుకునేందుకు ఇలాంటి వివాదాస్పద చర్యలకు పాల్పడతారని అన్నారు. ఈ మేరకు ‘ఇండియా టుడే కాంక్లేవ్ ఈస్ట్ 2022’లో దిలీప్ ఘోష్ మాట్లాడారు.