Bengal SSC scam: బెంగాల్ పాఠశాల ఉద్యోగాల కుంభకోణంలో టీఎంసీ ఎమ్మెల్యేకు ఈడీ సమన్లు..
ABN , First Publish Date - 2022-07-27T05:23:12+05:30 IST
పశ్చిమబెంగాల్ పాఠశాల ఉద్యోగాల కుంభకోణంలో (SSC Scam) ఆ రాష్ట్ర పారిశ్రామిక మంత్రి, టీఎంసీ సెక్రటరీ జనరల్ పార్థా చటర్జీని (Partha Chatterjee) అరెస్ట్ చేసిన..
కోల్కత్తా: పశ్చిమబెంగాల్ పాఠశాల ఉద్యోగాల కుంభకోణంలో (SSC Scam) ఆ రాష్ట్ర పారిశ్రామిక మంత్రి, టీఎంసీ సెక్రటరీ జనరల్ పార్థా చటర్జీని (Partha Chatterjee) అరెస్ట్ చేసిన ఈడీ (ED) కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కుంభకోణం కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇదే కేసులో మంగళవారం నాడు తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్యకు ఈడీ సమన్లు పంపింది. బుధవారం నాడు విచారణకు హాజరు కావాలని ఈ టీఎంసీ ఎమ్మెల్యేకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది. మాణిక్ భట్టాచార్య గతంలో బెంగాల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డ్కు చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇదిలా ఉండగా ఈ కేసులో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సహాయకురాలు అర్పిత ముఖర్జీ ఆగస్ట్ 3 వరకూ ఈడీ కస్టడీలోనే ఉండబోతున్నారు.
2014-2021 వరకు పార్థా చటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలోనే విద్యాశాఖలో ఈ కుంభకోణం వెలుగుచూసింది. ఈ కేసుకు సంబంధించి ఆయన్ను ఈడీ అధికారులు ఇప్పటికే గంటల పాటు ప్రశ్నించారు. అరెస్టు తర్వాత ఆయన్ను ఆస్పత్రికి తరలించి ఆరోగ్య పరీక్షలు చేయించారు. తాను సీఎం మమతా బెనర్జీని సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆమె అందుబాటులోకి రాలేదని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చటర్జీ చెప్పారు. కాగా పార్థా చటర్జీకి సన్నిహితురాలైన ఆర్పితా ముఖర్జీ ఇంట్లో రూ.21 కోట్ల నగదు దొరకడంతో ఆమెనూ ఈడీ అదుపులోకి తీసుకుంది.