Congress Presidential Polls: శశి థరూర్పై అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-10-02T19:14:13+05:30 IST
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న శశి థరూర్ ఉన్నత
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న శశి థరూర్ ఉన్నత వర్గానికి చెందినవారని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. తన మద్దతు మల్లికార్జున్ ఖర్గేకేనని తెలిపారు. రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఒత్తిడి కారణంగా ఈ ఎన్నికల బరి నుంచి గెహ్లాట్ తప్పుకున్న సంగతి తెలిసిందే.
అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) ఆదివారం మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ, మల్లికార్జున్ ఖర్గే గొప్ప రాజకీయ అనుభవజ్ఞుడని, ఆయన కాంగ్రెస్ను బలోపేతం చేయగలరని అన్నారు. ఆయన నిష్కళంక చరితుడని, దళిత జాతిలో జన్మించారని చెప్పారు. ఆయనను అందరూ స్వాగతిస్తున్నారన్నారు. పార్టీ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో ఆయన కచ్చితంగా గెలుస్తారని తెలిపారు.
శశి థరూర్ గురించి మాట్లాడుతూ, ఆయన ఉన్నత స్థాయి వర్గానికి చెందినవారని వ్యాఖ్యానించారు. అయితే పార్టీని బూత్, బ్లాక్, జిల్లా స్థాయుల్లో బలోపేతం చేయడానికి అవసరమైన అనుభవం ఖర్గేకు ఉందని, థరూర్తో ఆయనను పోల్చకూడదని అన్నారు. ఖర్గేకు ఇది ఏకపక్ష పోటీ అని తెలిపారు.
తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఎన్నికల్లో ఆయనకు మద్దతిస్తున్నవారిలో మాజీ కేంద్ర మంత్రులు మొహిసినా కిద్వాయ్, సైఫుద్దీన్ సోజ్, ఎంపీలు కార్తి చిదంబరం, ప్రద్యుత్ బొర్డోలోయ్, ఎంకే రాఘవన్, మహమ్మద్ జావేద్, 2020లో సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మందిలో ఒకరైన సందీప్ దీక్షిత్ ఉన్నారు.
#ThinkTharoorThinkTomorrow అనేది శశి థరూర్ సోషల్ మీడియా హ్యాష్ట్యాగ్. మార్పు కోసం తనకు ఓటు వేయాలని ఆయన కోరుతున్నారు.
అక్టోబరు 17న జరిగే ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులైనవారు దాదాపు 9,000 మంది ఉన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయాల్లో ఓట్లు వేస్తారు. అక్టోబరు 19న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎక్కువ ఓట్లు లభించిన అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు.