AAP Vs BJP : సీబీఐ కార్యాలయం వద్ద ఆప్ ధర్నా ... ‘ఆపరేషన్ లోటస్’పై దర్యాప్తునకు డిమాండ్...
ABN , First Publish Date - 2022-08-31T23:00:17+05:30 IST
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), భారతీయ జనతా పార్టీ (BJP) మధ్య యుద్ధం
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), భారతీయ జనతా పార్టీ (BJP) మధ్య యుద్ధం తీవ్రతరమవుతోంది. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ (Delhi Excise Policy) అమలులో అక్రమాలకు పాల్పడినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కేసు నమోదు చేయడంతో ఆప్ ఎదురుదాడిని మరింత పెంచింది. సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించి, బీజేపీ నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ లోటస్’పై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది.
ఆపరేషన్ లోటస్ ద్వారా బీజేపీ అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపించింది. ఆప్ నేతలు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్, అతిషి సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు సీబీఐ ప్రధాన కార్యాలయంలోకి దూసుకెళ్ళేందుకు ప్రయత్నించారు. పోలీసులు వీరిని నిలువరించడంతో అక్కడికక్కడే ధర్నా చేశారు.
అంతకు ముందు అతిషి ఇచ్చిన ట్వీట్లో, ప్రభుత్వాలను కూల్చేందుకు ‘ఆపరేషన్ లోటస్’ కోసం బీజేపీ రూ.6,300 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.