Golden Temple: చంపుతుంటే నిలబడి ‘సినిమా’ చూశారు.. చంపాక నిదానంగా వెళ్లిపోయారు!

ABN , First Publish Date - 2022-09-09T01:37:27+05:30 IST

అక్కడ ముగ్గురు వ్యక్తులు మరో వ్యక్తితో మధ్య గొడవ జరుగుతోంది. అందరూ ఆగి చూశారు. అటువైపుగా వెళ్తున్న వాహనాల్లోని

Golden Temple: చంపుతుంటే నిలబడి ‘సినిమా’ చూశారు.. చంపాక నిదానంగా వెళ్లిపోయారు!

అమృత్‌సర్: అక్కడ ముగ్గురు వ్యక్తులు మరో వ్యక్తితో మధ్య గొడవ జరుగుతోంది. అందరూ ఆగి చూశారు. అటువైపుగా వెళ్తున్న వాహనాల్లోని వారు కూడా కాసేపు ఆగి చూశారు. మరికొందరు అక్కడే ఉండి చోద్యం చూశారు. గొడవ ముదిరింది. పెరిగి పెద్దదైంది. తనపైకి వస్తున్న ఇద్దరు ముగ్గురు వ్యక్తులను ఒక్కడే ఎదురించాడు. వారితో కలబడ్డాడు. ఆ తర్వాత అతడు కిందపడడంతో వారికి చిక్కాడు. ఇద్దరు వ్యక్తులు ఇదే సరైన అవకాశమని భావించి అతడిని కత్తితో పొడిచి చంపారు. చనిపోయాడని భావించిన తర్వాత అప్పటి వరకు ‘సినిమా’ చూస్తున్న వారు నెమ్మదిగా అక్కడిని నుంచి వెళ్లిపోయారు. 


పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో బుధవారం అర్ధ రాత్రి దాటక జరిగిందీ ఘటన. ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 20 ఏళ్ల కార్మికుడిని ఆయుధాలు ధరించిన ఇద్దరు సిక్కులు సహా ముగ్గురు దాడిచేసి చంపేశారు. స్వర్ణ దేవాలయం కొలువైన అమృత్‌సర్ వీధిలో అతడు పొగాకు నములుతున్నాడన్న కారణంతోనే ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. అందరూ చూస్తుండగానే జరిగిన ఈ హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకెక్కి వైరల్ అయింది. నిందితుల్లో ఒకడైన రమణ్‌దీప్ సింగ్‌ను పోలీసులు అదరెస్ట్ చేయగా, మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. గురువారం ఉదయం పోలీసులు వచ్చే వరకు రక్తపు మడుగులో మృతదేహం అలాగే ఉంది.


పోలీసుల కథనం ప్రకారం.. చటివిండ్ ప్రాంతానికి చెందిన బాధితుడు హర్మన్‌జీత్ సింగ్ దారిన వెళ్తూ పొగాకు నమలడాన్ని నిందితులు చూశారు. దీంతో గొడవ జరిగి హత్యకు దారితీసిందని పోలీస్ కమిషనర్ అరుణ్ పాల్ సింగ్ తెలిపారు. హత్య జరుగుతున్న సమయంలో అక్కడ ఆరేడుగురు ఉన్నారని, కానీ ఒక్కరు కూడా తమకు సమాచారం ఇవ్వకపోవడం సిగ్గుచేటని అన్నారు. తన కుమారుడు త్వరలోనే విదేశాలకు వెళ్లాల్సి ఉందని చెబుతూ బాధితుడు హర్మన్‌జీత్ తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. 

Updated Date - 2022-09-09T01:37:27+05:30 IST