బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి

ABN , First Publish Date - 2022-09-11T09:53:26+05:30 IST

బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి

బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి

ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన


వికారాబాద్‌, సెప్టెంబరు 10: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఓ మహిళ మృతి చెందగా ఆమె బంధుమిత్రులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. వైద్యులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన శనివారం వికారాబాద్‌ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వికారాబాద్‌ మండలం మైలార్‌ దేవరంపల్లికి చెందిన మహేశ్‌ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నిండు గర్భిణి అయిన ఆయన భార్య రమాదేవి(28)కి శుక్రవారం అర్ధరాత్రి పురుటినొప్పులు రావడంతో.. వికారాబాద్‌లోని మెడిక్యూర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు రక్తం తక్కువగా ఉందని, లో-బీపీ కూడా ఉందని వివరించిన వైద్యులు.. శస్త్రచికిత్సకు ఏర్పాటు చేశారు. ఈలోగా రమాదేవి కుటుంబ సభ్యులు తాండూరు నుంచి రక్తం తెప్పించారు. శనివారం తెల్లవారుజామున రమాదేవికి శస్త్రచికిత్స చేశారు. ఆమె పండంటి బాబుకు జన్మనిచ్చింది. ‘‘ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. మధ్యాహ్నం 12 గంటలకు రమాదేవి చనిపోయిందన్నారు’’ అని రమాదేవి బంధువులు వాపోయారు. దీంతో రమాదేవి బంధుమిత్రులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5.30 సమయంలో మృతురాలి బంధువులు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై విచారణకు డీఎంహెచ్‌వో ఆదేశాలు జారీ చేశారు. డాక్టర్‌ అరవింద్‌ విచారణ జరిపారు. రమాదేవికి శస్త్రచికిత్స జరిపిన గైనకాలజిస్టు మల్లిక, అనస్తీషియా నిపుణుడు సాయిగుప్తాను విచారించారు. పోలీసులు మాత్రం ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. అయితే.. రమాదేవిని కాపాడే ప్రయత్నం చేశామని మెడిక్యూర్‌ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ వెంకట్‌రెడ్డి తెలిపారు. ‘‘ఆమె పరిస్థితిని కుటుంబ సభ్యులకు ముందే వివరించాం. రక్తం తేవడానికి అంబులెన్స్‌ను కూడా పంపాం. కాన్పు అయ్యాక.. రమాదేవి వాంతులు చేసుకుంటూ.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంది. ఆక్సిజన్‌ అందించి, సీపీఆర్‌ చేశాం. కానీ, మా ప్రయత్నాలు ఫలించలేదు’’ అని ఆయన వివరించారు.

Updated Date - 2022-09-11T09:53:26+05:30 IST