విద్యార్థినులతో టీయూ వీసీ నృత్యాలు
ABN , First Publish Date - 2022-09-11T09:38:08+05:30 IST
విద్యార్థినులతో టీయూ వీసీ నృత్యాలు
సోషల్ మీడియాలో వీడియో వైరల్.. వీసీ దిష్టిబొమ్మ దహనం
డిచ్పల్లి, సెప్టెంబరు 10: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో హాస్టల్ విద్యార్థినులతో వీసీ రవీందర్ గుప్తా నృత్యాలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. రెండు రోజుల క్రితం వర్సిటీలోని అమ్మాయిల హాస్టల్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన కార్యక్రమానికి విద్యార్థినులు వీసీని ఆహ్వానించారు. దీంతో అక్కడికి వెళ్లిన రవీందర్ గుప్తా.. కొందరు విద్యార్థి సంఘాల నాయకులు, ప్రొఫెసర్లు, విద్యార్థినులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విద్యార్థినులతో వీసీ అసభ్యకరంగా ప్రవర్తించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఈ ఘటనను నిరసిస్తూ శనివారం విద్యార్థి సంఘాల నాయకులు బాలికల వసతి గృహం వద్ద వీసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై వీసీ రవీందర్ గుప్తా స్పందించారు. తనపై కావాలనే కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించలేదని, డబ్బులు వెదజల్లలేదని చెప్పారు.