స్నోవరల్డ్కు హైకోర్టులో ఊరట
ABN , First Publish Date - 2022-09-08T10:19:26+05:30 IST
హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్లోని స్నో వరల్డ్ ప్రాజెక్ట్కి హైకోర్టులో ఊరట లభించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్లోని స్నో వరల్డ్ ప్రాజెక్ట్కి హైకోర్టులో ఊరట లభించింది. ఓషియన్ పార్క్ మల్టీటెక్ లిమిటెడ్ కంపెనీ నిర్వహిస్తున్న ‘స్నో వరల్డ్ ప్రాజెక్టు’కు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ వేసిన సీల్ను తొలిగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. లీజు బకాయిలు చెల్లించకపోవడంతో స్నో వరల్డ్ ప్రాజెక్టుకు టూరిజం కార్పొరేషన్ సీల్ వేసింది. దీనిని సవాల్ చేస్తూ స్నో వరల్డ్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపి స్తూ లీజు ఒప్పందం మేరకు 50 శాతం మొత్తం చెల్లించాలని దిగువ కోర్టు ఆదేశాలను పిటిషనర్ అమలు చేయలేదని పేర్కొన్నారు. మూడు రోజుల వ్యవధిలో రూ.50 లక్షలు, మరో మూడు వారాల వ్యవధిలో రూ. 50 లక్షలు చెల్లించాలని పిటిషనర్కు ఆదేశాలు జారీచేసింది. సీల్ను తొలగించాలని టూరిజం కార్పొరేషన్కు సూచించింది.