డయాబెటిస్‌ రోగులకు శుభవార్త!

ABN , First Publish Date - 2022-09-24T18:36:13+05:30 IST

మీరు మధుమేహులా? మీకు పనస పొట్టు కూర అంటే ఇష్టమా? పనసపొట్టును కూరగా గానీ, బిర్యానీగా గానీ ఏ రూపంలోనైనా

డయాబెటిస్‌ రోగులకు శుభవార్త!

ఎండు పనస పొడితో మధుమేహం నియంత్రణ

పనసను ఎండబెట్టి పౌడర్‌గా ఆహారంలో వాడితే మేలు

శ్రీకాకుళం వైద్య విజ్ఞాన సంస్థ పరిశోధనల్లో వెల్లడి

జాక్‌ ఫ్రూట్‌ 365 సంస్థ ఆధ్వర్యంలో పొడి విక్రయాలు


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మీరు మధుమేహులా? మీకు పనస పొట్టు కూర అంటే ఇష్టమా? పనసపొట్టును కూరగా గానీ, బిర్యానీగా గానీ ఏ రూపంలోనైనా ఆహారంలో తీసుకున్నా కూడా మీకు మధుమేహం అదుపులో ఉంటుందట! ఎండు పనస పొడి మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుందని శ్రీకాకుళం వైద్య విజ్ఞాన సంస్థ పరిశోధనల్లో వెల్లడైనట్లు ఆ పరిశోధనలో పాలుపంచుకున్న వైద్యులు తెలిపారు. తరచూ పనస పొట్టును ఆహారంలో వినియోగించుకోవడం ద్వారా బ్లడ్‌షుగర్‌ నియంత్రణలో ఉండటంతో పాటు, మలబద్ధకం వంటి సమస్యలు దూరమైనట్లు పరిశోధనల్లో తేలిందని అహ్మదాబాద్‌ రామానంద్‌ క్లినిక్‌ ఎండ్రోకిన్‌ పిజీషియన్‌ డాక్టర్‌ వినోద్‌ అభిచందాని తెలిపారు. జాక్‌ఫ్రూట్‌ 365 సంస్థ శుక్రవారం బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ వినోద్‌ మాట్లాడారు. పనస పండు దక్షిణాది వంటకాల్లో విరివిగా వాడతారని, పండని పనసను ఎండబెట్టి పౌడర్‌ రూపంలో ఆహార పదార్థాల్లో కలిపి తింటే ప్రయోజనం ఉంటుందని చెప్పారు. అనంతరం జాక్‌ ఫ్రూట్‌ 365 వ్యవస్థాపకులు జేమ్స్‌ జోసెఫ్‌ పరిశోధన వివరాలను వెల్లడించారు. 


ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో ఉన్న ప్రభుత్వ వైజ్ఞానిక సంస్థలో టైప్‌ టూ డయాబెటిస్‌తో బాధపడుతున్న 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులైన 40 మందిని రెండు గ్రూప్‌లుగా విభజించి పరిశోధనలు నిర్వహించామని చెప్పారు. ఒక గ్రూపు వారికి భోజనానికి ముందు పచ్చి పనస పొట్టు, వరుసగా 12 వారాల పాటు అందించామని వెల్లడించారు. పచ్చి పసన పొట్టు తీసుకోని వారితో పోల్చితే, టైప్‌ టూ డయాబెటిస్‌ మెలిటస్‌ రోగుల్లో గ్లైసిమిన్‌ నియంత్రణలో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఫెర్నాండజ్‌ ఆస్పత్రి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ క్లినికల్‌ న్యూట్రిషన్‌ హెచ్‌వోడీ డాక్టర్‌ లతా శశి మాట్లాడుతూ మధుమేహ రోగుల్లో పచ్చి పనసపొట్టు ప్రయోగాన్ని తాను పరిశీలించానని.. దీనిపై మరిన్ని పరిశోధనలు జరిగితే మధుమేహ రోగులకు మేలు జరుగుతుందని చెప్పారు. ఆహార అలవాట్లను మార్చుకోకుండానే మనం తినే ఆహారంలో ఎండు పసన పొడిని వాడడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా జాక్‌ ఫ్రూట్‌ 365 రూపొందించిన ఎండు పనస పొడి ప్యాకెట్ల విక్రయాన్ని ప్రారంభించారు.

Updated Date - 2022-09-24T18:36:13+05:30 IST