‘మణి’ దక్కేదెవరికి!?
ABN , First Publish Date - 2022-02-23T08:12:26+05:30 IST
గత ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రె్సను చీల్చి.. ఇతర పార్టీల మద్దతుతో తొలిసారి మణిపూర్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ...
రాష్ట్రంగా ఆవిర్భవించి 50 ఏళ్లు.. 2012లో తప్ప ఏ ఎన్నికల్లోనూ ఎవరికీ దక్కని మెజారిటీ
అన్నీ సంకీర్ణ ప్రభుత్వాలే
మణిపూర్ ఎన్నికల ముఖచిత్రం
గత ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రె్సను చీల్చి.. ఇతర పార్టీల మద్దతుతో తొలిసారి మణిపూర్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఈ సారి సంపూర్ణ ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేయగలమన్న ధీమాతో ఉంది. ఈశాన్య భారతంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి మౌలిక వసతుల కల్పనకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషి.. సీఎం బీరేన్సిం గ్ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం గత ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయని విశ్వసిస్తోంది. చీలికలు, ఫిరాయింపులతో కాంగ్రెస్ కుదేలైనా.. దాని బలం ఏ మాత్రం తగ్గలేదు. బీజేపీకి కేంద్రంలో, రాష్ట్రం లో మద్దతిస్తున్న నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్), నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) వేర్వేరుగా బరిలో ఉన్నా.. తాము ఎన్డీఏలో భాగమేనని, ఎన్నికల తర్వాత బీజేపీతోనే ఉంటామని చెబుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో వరుసగా రెండు సార్లు అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న మణిపూర్ పీపుల్స్ పార్టీ(ఎంపీపీ) ప్రస్తుతం ఉనికి కోల్పోయింది. చాలా పార్టీలు బరిలో నిలవడంతో మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లోనూ బహుముఖ పోటీ నెలకొంది. రెండు దశ ల్లో.. ఈ నెల 28న 38 సీట్లకు, మార్చి 5న 22 సీట్లకు పోలింగ్ రుగనుంది. మార్చి 10న మిగతా నాలుగు రాష్ట్రాలతో పాటే ఇక్కడా ఫలితాలు ప్రకటిస్తారు.
12 ఎన్నికల్లో..
1972లో కేంద్రపాలిత ప్రాంతం నుంచి రాష్ట్రంగా ఆవిర్భవించిన మణిపూర్లో 2017 వరకు 12 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2012లో తప్ప ఏ పార్టీ కూడా 60 మంది సభ్యుల అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 31 సీట్లను సొంతగా సాధించలేదు. ఇతర పార్టీల మద్దతుతోనే గద్దెనెక్కుతూ వస్తున్నాయి. 2012లో మాత్రం ఇబోబీ సింగ్ సారథ్యంలో కాంగ్రెస్ 42 స్థానాలు సాధించి అధికారం చేపట్టింది. 2017లో 28 స్థానాలు సాధించి ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. కానీ 21 స్థానాలే గెలిచిన బీజేపీ.. ఎన్పీఎఫ్ (4), ఎన్పీపీ(4), ఎల్జేపీ (1) మద్దతుతో రాష్ట్రంలో మొదటిసారి గద్దెనెక్కింది. ఎన్.బీరేంద్రసింగ్ సీఎం అయ్యారు. 2007, 12 ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోని బీజేపీ.. 2017లో ఏకంగా అధికారాన్నే చేపట్టడం గమనార్హం. పైగా కాంగ్రెస్ (35.11ు) కంటే ఎక్కువగా 36.28ు ఓట్లు సాధించింది. అనంతర పరిణామాల్లో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇక్కడ చక్రం తిప్పి.. ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకొచ్చారు.
ఫిరాయింపులకు సంబంధించిన న్యాయవివాదాల నడుమే బీరేంద్రసింగ్ ఐదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్నారు. తమ ఏలుబడిలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో చూసి ఓట్లేయాలని బీజే పీ నేతలు ప్రజలను కోరుతున్నారు. అన్ని రకాల సేవ లూ ప్రజల ఇళ్లకే అందేలా చర్యలు చేపమని, ఇది తన కు ఓట్లు కురిపిస్తుందని బీజేపీ నమ్మకంతో ఉంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఉందని.. నిరుద్యోగం ప్రబలిందని.. ఇది తనకు కలిసి వస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. సీపీఐని, క్షేత్రస్థాయిలో కొన్ని చిన్న చిన్న పార్టీలను కూడగట్టుకుని బీజేపీకి గట్టి పోటీయే ఇస్తోంది. దీనికితోడు కాషాయ పార్టీలో టికెట్లు దొరకని పలువురు నేతలు జేడీయూ, ఎన్పీపీల్లో చేరి బరిలోకి దిగారు. స్వల్ప మెజారిటీయే రాష్ట్రంలో గెలుపోటములను ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో వీరి ఫిరాయింపులు బీజేపీ విజయావకాశాలకు గండి కొట్టే అవకాశం లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు.
కొండ.. మైదానం!
మణిపూర్ కొండ ప్రాంతం, మైదాన ప్రాంతం అని రెండు భాగాలుగా ఉంది. మైదాన ప్రాంతంలో 40 స్థానాలున్నాయి. ఇక్కడ వైష్ణవ హిందువులు అధికం. ముస్లింలూ ఉన్నారు. కొండ ప్రాంతాల్లో 20 సీట్లు ఉండగా.. ఇక్కడ నాగా, కుకీ వర్గీయుల బలమెక్కువ. రెండు వర్గాలూ క్రైస్తవులే అయినా పరస్పరం పొసగదు. నాగా లు ఎన్పీఎ్ఫకు మద్దతిస్తుండగా.. కుకీలు కాంగ్రెస్ వైపు ఉన్నారు. అయి తే కుకీల కూటమి ఆవిర్భావంతో కాంగ్రెస్ ఓట్లకు గండిపడొచ్చని అంటున్నా రు. కొండ ప్రాంతాల్లో సాయుధ బలగాల చట్టాన్ని రద్దు చేయాలన్న డిమాండ్కు అన్ని పార్టీలూ మద్దతిస్తున్నాయి. బీజేపీ వైఖరి ఇప్పటిదాకా వెల్లడికాలేదు.
- సెంట్రల్ డెస్క్.