Malikarjun Kharge: మోదీని ‘అబద్ధాలకు అధిపతి’గా అభివర్ణించిన ఖర్గే

ABN , First Publish Date - 2022-11-27T21:34:41+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi)ని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ‘అబద్ధాలకు అధిపతి’

Malikarjun Kharge: మోదీని ‘అబద్ధాలకు అధిపతి’గా అభివర్ణించిన ఖర్గే

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi)ని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ‘అబద్ధాలకు అధిపతి’ (chieftain of liars)గా అభివర్ణించారు. తాను పేదవాడినని చెప్పుకోవడం ద్వారా ప్రజల నుంచి సానుభూతి పొందాలని చూస్తున్నారని అన్నారు. మరికొన్ని రోజుల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లోని నర్మదా జిల్లాలోని గిరిజన ప్రాబల్యం కలిగిన దేడియాపడలో నిర్వహించిన బహిరంగ ర్యాలీలో పాల్గొన్న ఖర్గే (Mallikarjun Kharge) మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను నిరుపేద కుటుంబం నుంచి, అంటరాని కులం నుంచి వచ్చానని ఖర్గే తెలిపారు.

ఈ 70 సంవత్సరాలలో కాంగ్రెస్ ఏం చేసిందని ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా ప్రశ్నిస్తారని.. కానీ, తామేమీ చేయకుంటే మీకు ప్రజాస్వామ్యమే ఉండేది కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీ (మోదీ)లాంటి వ్యక్తులు తాము ఎప్పుడూ పేదవాళ్లమని చెప్పుకుంటారని, కానీ తాను కూడా పేదవాడినేనని అన్నారు. తానో అంటరాని కులం నుంచి వచ్చానని పేర్కొన్నారు. ప్రజలు కనీసం మీరిచ్చిన టీ అయినా తాగారేమో కానీ, తానిచ్చిన చాయ్‌ని ఎవరూ తాగలేదని ఖర్గే అన్నారు.

తాను చాలా పేదవాడినని, తనను ఎవరో తిట్టారని చెబుతూ ప్రధాని సానుభూతి పొందాలని మోదీ చూస్తున్నారని, కానీ ప్రజలు ఇప్పుడు తెలివైన వారని, వారు అర్థం చేసుకోలేనంత తెలివితక్కువ వారు కాదని అన్నారు. మీ అబద్ధాలను ప్రజలు ఒకటి రెండుసార్లు మాత్రమే వింటారని మోదీని ఉద్దేశించి ఖర్గే అన్నారు. ఒకే అబద్ధాన్ని ఎన్నిసార్లు చెబుతారని ప్రశ్నించారు. అబద్ధం తర్వాత అబద్ధం చెప్పడంలో మోదీ మునిగిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఈ దేశాన్ని లూటీ చేసిందని చెబుతూనే మోదీ మాత్రం సంపన్నుల పక్షాన నిలబడుతున్నారని ధ్వజమెత్తారు. పేదల భూములను మోదీ దోచుకుంటున్నారని, ఆదివాసీలకు భూములు ఇవ్వడం లేదని మండిపడ్డారు. భూములను, అడవిని, నీళ్లను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ధనికుల పక్షాన నిలుస్తున్నారని, వారేమే మనల్ని దోచుకుంటున్నారని ఖర్గే విమర్శించారు.

Updated Date - 2022-11-27T21:34:43+05:30 IST