TSPSC: గ్రూప్స్ నోటిఫికేషన్లపై కసరత్తు
ABN , First Publish Date - 2022-11-30T14:41:44+05:30 IST
ప్రభుత్వం అనుమతించిన గ్రూప్-2, 3, 4 పోస్టుల భర్తీ (Groups notifications)కి నోటిఫికేషన్లను జారీ చేయడానికి అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. అందులో భాగంగా ఆయా విభాగాల
హైదరాబాద్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అనుమతించిన గ్రూప్-2, 3, 4 పోస్టుల భర్తీ (Groups notifications)కి నోటిఫికేషన్లను జారీ చేయడానికి అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. అందులో భాగంగా ఆయా విభాగాల అధికారులతో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటుచేస్తున్నారు. పోస్టుల భర్తీలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశాల్లో చర్చిస్తున్నారు. ప్రస్తుతం గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించి.. ఆయా విభాగాల్లో ఖాళీల సంఖ్య, రోస్టర్ పాయింట్లు, నిబంధనల వంటి వాటిని పరిశీలిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఛైర్మన్ జనార్దన్రెడ్డి సమక్షంలో జరుగుతున్న ఈ సమావేశాలకు.. రోజూ కొన్ని విభాగాల అధికారులు హాజరవుతున్నారు. గ్రూప్-4 ఉద్యోగాలు సుమారు 97 శాఖల్లో ఉన్నాయి. దాంతో రోజుకు 30 శాఖలకు చెందిన అధికారులతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. గురువారంతో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం గ్రూప్-2 పోస్టులకు సంబంధించిన విభాగాల అధికారులతో సమావేశాలు జరగనున్నాయి. ఈ ప్రకియ్ర ముగిసిన తర్వాత... డిసెంబరు నెలాఖరులోగా గ్రూప్-2, 3, 4 నోటిఫికేషన్లను జారీ చేయాలని టీఎ్సపీఎస్సీ అధికారులు భావిస్తున్నారు.
భూగర్భజల శాఖలో 57 పోస్టులకు నోటిఫికేషన్
కాగా, రాష్ట్ర భూగర్భ జల శాఖలో 57 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో 32 గెజిటెడ్ పోస్టులుండగా, మరో 25 ఇతర పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు మంగళవారం టీఎ్సపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు డిసెంబరు 7 నుంచి 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
కేంద్రీయ విద్యాలయాల్లో 6,414 పోస్టులు
కేంద్రీయ విద్యాలయాల్లో 6,414 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో టీజీటీ, పీజీటీ, సెక్షన్ ఆఫీసర్లు, ప్రిన్సిపాల్ తదితర పోస్టులున్నాయి. డిసెంబర్ 5 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ డిసెంబరు 26. ప్రిన్సిపాల్ పోస్టులకు రూ.1200, మిగతా పోస్టులకు రూ.750 చొప్పున పరీక్ష ఫీజు చెల్లించాలి.