ట్రిపుల్‌ ఐటీ మెస్‌ టెండర్లలో మాయాజాలం

ABN , First Publish Date - 2022-09-21T20:05:36+05:30 IST

బాసర ట్రిపుల్‌ఐటీ(Basara Triple IT)లో మెస్‌ల విషయంలో అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తుంది. గత అను భవాల నుంచి పాఠాలు నేర్చుకోని అధికారులు కాంట్రాక్టర్ల(contractors) ఎంపికపై నిర్లక్ష్యం మరోసారి స్పష్టమవుతుంది

ట్రిపుల్‌ ఐటీ మెస్‌ టెండర్లలో మాయాజాలం

పెరగని మెస్‌ల సంఖ్య 

మళ్లీ మూడింటి కోసమే నోటిఫికేషన్‌ 

రూ. 10 కోట్ల టర్నోవర్‌పై అనుమానాలు

తెలిసిన వారి కోసమేనా ? 


బాసర, సెప్టెంబరు. 19 : బాసర ట్రిపుల్‌ఐటీ(Basara Triple IT)లో మెస్‌ల విషయంలో అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తుంది. గత అను భవాల నుంచి పాఠాలు నేర్చుకోని అధికారులు కాంట్రాక్టర్ల(contractors) ఎంపికపై నిర్లక్ష్యం మరోసారి స్పష్టమవుతుంది. ప్రస్తుతం యూనివర్సిటీలో ఉన్న కాం ట్రాక్టర్ల గడువు ముగియడంతో అధికారులు టెండరు నోటిఫికేషన్‌ వేశా రు. ఇప్పుడున్న మూడుమెస్‌లు సరిపోవడం లేదు. వీటిసంఖ్యను పెంచా లనేది విద్యార్థుల డిమాండ్‌. అధికారులు సైతం అనేక సార్లు తదుపరి టెండర్ల సమయంలో మెస్‌ల సంఖ్యను పెంచుతామని అనేక సార్లు ప్రకటించారు. కాని మళ్లీ అధికారులు ఒక్కోమెస్‌ కాంట్రాక్టర్‌ 3 వేల మందికి భోజనం తయారు చేయడానికి టెండర్లు పిలిచారు. కాని అధి కారులు మాత్రం ఒకే సంస్థకు 2 వేల విద్యార్థులకు మించి ఇవ్వద్దనేది ఎప్పటి నుండో అధికారుల ఆలోచన. ఒకేసంస్థకు 3 వేల మంది విద్యా ర్థుల భోజన బాధ్యతలను అప్పగించడం వల్ల ఆహారం రుచిగా ఉండక పోవడమేగాక అనేక నిర్వహణ సమస్యలు తలెత్తుతున్నాయి. మెస్‌ల సంఖ్య పెరగకపోవడం వెనుక ఏదో మయాజాలం జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


మళ్లీ.. మళ్లీ అదే తప్పు

ప్రస్తుతం యూనివర్సిటీలో 9వేల మంది విద్యార్థులు ఉండగా మూడు మెస్‌లు ఉన్నాయి. ఒక్కోసంస్థ 3 వేల మంది విద్యార్థులకు మూడు పూటలా భోజనం వండి పెడుతుంది. ఇంత పెద్దసంఖ్య కావడంతో భోజ నం రుచిగా ఉండడం లేదు. ముందుగా తయారు చేయడంతో చల్లారిన తర్వాత వడ్డించే పరిస్థితి ఎదురవుతుంది. ఉదాహరణకు ఉదయం 8 గంటలకు విద్యార్థులకు చపాతీ వడ్డించడం ఉంటే వాటిని ఉదయం 4 గంటల నుంచే తయారు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో విద్యార్థులకు చల్లారిపోయిన చపాతీలు వడ్డిస్తున్నారు. దీనికి తోడు ఇటీవలే సరిగా సరిగ్గా ఉడకని అన్నంతో, వేగని ఎగ్‌ప్రైడ్‌ రైస్‌ వికటించి వందలమంది విద్యార్థులు ఆస్పత్రి పాలైనా సంగతి తెలిసిందే.  ఇక తరుచుగా కూరల్లో, భోజనాల్లో పురుగులు, కీటకాలు, కప్పలు రావడం ఇక్కడ పరిపాటిగా మారింది. ఇవన్నీ విద్యార్థుల సంఖ్య ఎక్కువ కావడం వల్లనే మెస్‌ కాం ట్రాక్టర్లు నిర్వహణ లోపం కారణంగా సమస్యలు వస్తున్నాయని అధి కారులు గుర్తించారు. రాబోయే రోజుల్లో మెస్‌ల సంఖ్యను పెంచాలని అధికారులు నిర్ణయించారు. మళ్లీ మూడుమెస్‌ల కోసమే టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడం విమర్శలకు తావిస్తుంది. ప్రస్తుతం ట్రిపు ల్‌ఐటీలో ఉన్న మూడుమెస్‌లకు అదనగా మరో మూడు మెస్‌లు నిర్వ హించుకునేందుకు అవసరమైన భవనాలు, కిచెన్‌ ఎక్విప్‌మెంట్స్‌  విద్యా ర్థులు భోజనం చేసే డైనింగ్‌హాల్‌లు వంటి వసతులకు ఇబ్బంది లేదు. అదనపు భవనాలు ఉన్నాయి. వంటసామాగ్రి కూడా పెద్దఎత్తున స్టోరూ మ్‌లో పడిఉంది. కాని అధికారులు మాత్రం మెస్‌లసంఖ్యను పెంచడం లేదు. మళ్లీ విద్యార్థులను భోజన విషయంలో ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంది.


రూ. 10 కోట్ల టర్నోవర్‌ అందుకేనా?

ఈసారి టెండరు నిబంధనల్లో అధికారులు రూ.10 కోట్ల టర్నోవర్‌ను ఉంచారు. రూ.10 కోట్ల టర్నోవర్‌ ఉన్న సంస్థలే టెండర్‌లో పాల్గొనాల్సి ఉంది. ఈ అర్హత ఉన్న కంపెనీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ఉన్నత విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, జేఎన్‌టీయూ, ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్జీయూకేటీ మెస్‌టెండర్లల్లో లేని నిబంధనలు అధి కారులు ఇక్కడ పొందుపరచడం అనేక ఆరోపణలకు తావిస్తుంది. రూ. 10 కోట్ల టర్నోవర్‌ ఉన్న కంపెనీల కోసమే ఈ నిబంధనను టెండరు డాక్యుమెంట్‌లో చేర్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండరు ప్రక్రియ గవర్నమెంట్‌ ఆఫ్‌ పైనాన్షియల్‌ రెగ్యులేటర్‌ (జీఎఫ్‌ఆర్‌), సెంట్రల్‌ విజి లెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) నిబంధనలకు ప్రకారం టెండరు నిర్వహించడం లేద నే వాదనలు వినిపిస్తున్నాయి.    


మెస్‌ల సంఖ్యను పెంచే విషయం పరిశీలిస్తాం 

మెస్‌టెండర్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు యూనివర్సిటీలో అంత ర్గతంగా కమిటీ నియమించాం. కమిటీ సూచనల మేరకు టెండర్లు పిలి చాం. టెండరు ప్రక్రియ పూర్తికానందున మార్పులు చేసుకునే అవకాశం ఉంది. మూడు మెస్‌లు కాకుండా ఆ సంఖ్యను పెంచే విషయం పరి శీలిస్తాం. త్వరలోనే దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. 

-(వెంకటరమణ, వైస్‌ చాన్సలర్‌, ఆర్జీయూకేటీ)


మెస్‌ల సంఖ్యను ఆరుకు పెంచాలి 

ట్రిపుల్‌ ఐటీలో ఇప్పుడున్న మెస్‌లను పూర్తి స్థాయిలో ఆధునికీ కరించాలి. ఇప్పుడున్న మూడు మెస్సులు ఏ మాత్రం సరి పోవడం లేదు. వాటిని ఆరుకు పెంచాలి. విద్యార్థుల భోజన వసతి బాధ్య తలను ఇస్కాన్‌, అమృత్‌ వంటి సంస్థలకు అప్పగించాలని అధికారులను కోరాం. నాన్‌వెజ్‌ లేకపోయిన విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతుంది. అధికారులు ప్రైవేటు సంస్థలకు కాకుండా సేవా సంస్థలకు అప్పగించాలి. 

-(రాజేశ్వరి, పెరెంట్స్‌ కమిటీ ప్రెసిడెంట్‌) 

Updated Date - 2022-09-21T20:05:36+05:30 IST