నిజామాబాద్లో టీచర్ల దుశ్చర్య: విద్యార్థి వీపుపై వాతలు, పగిలిన కర్ణభేరి
ABN , First Publish Date - 2022-09-13T17:44:09+05:30 IST
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు(teachers) విచక్షణ కోల్పోయారు. చిన్నపాటి తప్పునకే ముగ్గురు ఉపాధ్యాయులు కలిసి ఒక విద్యార్థిని వాతలు తేలేలా చితకబాదారు. విద్యార్థి చెవిపై బలంగా కొట్టడంతో కర్ణభేరి పగిలింది.
విద్యార్థిని చితకబాదిన టీచర్లు
ఆఫీస్ రూంలో బంధించి కర్రలతో కొట్టిన ముగ్గురు ఉపాధ్యాయులు
సీసీ కెమెరాలు ముట్టుకున్నాడని అమానుషం
దెబ్బలకు వాతలు తేలిన వీపు, పగిలిన కర్ణభేరి
ఇద్దరు కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల తొలంగింపు
నందిపేట, సెప్టెంబరు 12: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు(teachers) విచక్షణ కోల్పోయారు. చిన్నపాటి తప్పునకే ముగ్గురు ఉపాధ్యాయులు కలిసి ఒక విద్యార్థిని వాతలు తేలేలా చితకబాదారు. విద్యార్థి చెవిపై బలంగా కొట్టడంతో కర్ణభేరి పగిలింది. నిజామాబాద్ జిల్లా(Nizamabad District)లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నందిపేట మండలం నూతుపల్లికి చెందిన రుషేంద్ర గ్రామంలోని మహత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 9న రుషేంద్ర పాఠశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ముట్టుకున్నాడు. దీంతో కోపోద్రిక్తులైన పీఈటీ శ్రీకాంత్తో పాటు గణితం, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు శంకర్, నరేష్ కలిసి రుషేంద్రను అదే రోజు రాత్రి ఆఫీస్ గదిలో బంధించి కర్రలతో చితకబాదారు. దీంతో రుషేంద్ర వీపుపై వాతలు తేలాయి. చెవికి తీవ్ర గాయమైంది. రుషేంద్రను తల్లిదండ్రులు మరుసటి రోజున ఆస్పత్రిలో చూపించారు. అతని కర్ణభేరి దెబ్బతిందని, వెంటనే ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. ఇలా ఎలా జరిగిందని తల్లిదండ్రులు ఆరా తీయగా ముగ్గురు టీచర్లు కలిసి చితకబాదిన వైనాన్ని రుషేంద్ర వివరించాడు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు సోమవారం పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. వెంటనే ఆ ముగ్గురు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న పీఈటీ శ్రీకాంత్, గణితం ఉపాధ్యాయుడు శంకర్ను విధుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. సోషల్ టీచర్ నరేష్పై చర్యల కోసం ఉన్నతాధికారులకు సిఫారసు చేసినట్లు ఆర్సీవో తెలిపారు.