టెన్త్‌లో 6 పేపర్లే! గత ఏడాది విధానమే కొనసాగింపు

ABN , First Publish Date - 2022-10-14T17:08:39+05:30 IST

పదో తరగతి వార్షిక పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం కూడా 6 పేపర్ల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు సమర్పించిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం

టెన్త్‌లో 6 పేపర్లే! గత ఏడాది విధానమే కొనసాగింపు

విద్యార్థులపై తగ్గనున్న ఒత్తిడి

నవంబరు 1 నుంచి ఎస్‌ఏ-1 పరీక్షలు

ఇవి కూడా 6 పేపర్లలోనే

ఇంజనీరింగ్‌ ఫీజుల ఖరారు జీవో మరింత ఆలస్యం


హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి వార్షిక పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం కూడా 6 పేపర్ల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు సమర్పించిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని అనుసరించి... టెన్త్‌ వార్షిక పరీక్షల్లో 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లే ఇస్తారు.


తద్వారా విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. 2020-21లో కరోనా మహమ్మారి నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లకు కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఏడాది కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో పరీక్షలు జరగలేదు. తర్వాత 2021-22లో 6 పేపర్లలోనే పరీక్షలు జరిగాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ ఇదే కొనసాగనుంది. గతంలో తెలుగు, ఇంగ్లీష్‌, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులను రెండు పేపర్లుగా పరీక్షలు నిర్వహించేవారు. ఇక హిందీ సబ్జెక్ట్‌కు ఒకే పరీక్ష ఉండేది. తాజా నిర్ణయంతో అన్ని సబ్జెక్టుల్లోనూ ఒకటే పేపర్‌ ఇవ్వనున్నారు. కాగా... ఎస్‌ఏ-1 పరీక్షలను నవంబరు 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పరీక్షలు కూడా 6 పేపర్లలోనే జరగనున్నాయి. అయితే ఈ ఏడాది టెన్త్‌లో ఎప్పటిలాగే 11 పేపర్లలో పరీక్షలు ఉంటాయని జిల్లా విద్యాధికారులు భావించారు. 100 శాతం సిలబ్‌సతో ఎస్‌ఏ పరీక్షలను కూడా అదే పద్ధతిలో నిర్వహించడానికి సిద్ధమయ్యారు. కొన్ని జిల్లాల్లో ఎస్‌ఏ పరీక్ష ప్రశ్నత్రాలను కూడా ముద్రించారు. అయితే 6 పేపర్లే ఉంటాయనే సమాచారాన్ని గురువారం ఆయా జిల్లాలకు అధికారులు పంపించారు. దాంతో మళ్లీ కొత్తగా ప్రశ్నపత్రాలను ముద్రించాల్సి ఉంటుంది.


ఫీజుల ఖరారు జీవో మరింత ఆలస్యం

ఇంజనీరింగ్‌ ఫీజుల ఖరారుకు సంబంధించిన ఉత్తర్వుల జారీలో జాప్యం జరుగుతోంది. ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌ సమయానికి జీవో జారీ అవుతుందని భావించినా... గురువారం వరకు విడుదల కాలేదు. జీవో జారీకి మరో రెండు మూడు రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇంజనీరింగ్‌ ఫీజుల ఖరారుకు సంబంధించిన ఉత్తర్వుల ఫైల్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమోదానికి పంపించినట్టు తెలుస్తోంది. అయితే సీఎం ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉండటంతో జీవో ఆలస్యమవుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - 2022-10-14T17:08:39+05:30 IST