జగనన్న విదేశీ విద్యగా పేరుమారినట్లు నాకు తెలియదు
ABN , First Publish Date - 2022-07-18T21:00:28+05:30 IST
ప్రతిభావంతులకు అందించే అంబేద్కర్ విదేశీ విద్య పేరును జగనన్న విదేశీ విద్యగా మార్చినట్లు తనకు తెలియదని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విజయనగరంలో గురువారం
సమస్యలు ‘ఆంధ్రజ్యోతి’కే కనబడతాయా..?
మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం
విజయనగరం: ప్రతిభావంతులకు అందించే అంబేద్కర్ విదేశీ విద్య పేరును జగనన్న విదేశీ విద్యగా మార్చినట్లు తనకు తెలియదని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విజయనగరంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మెరిట్ విద్యార్థులకే విదేశీ విద్య అందిస్తామని, అందరూ విదేశాలకు వెళ్లి చదువుకోవాలంటే కుదరదన్నారు. గత ప్రభుత్వంలో విదేశీ విద్యా విధానంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. పాఠశాలల విలీనంపై రాష్ట్రవ్యాప్తంగా 270 ఫిర్యాదులు అందాయని, విద్యార్థుల వినతులు, ఉపాధ్యాయుల సమస్యలు దృష్టిలో ఉంచుకుని 117 జీవోను సవరిస్తామన్నారు. మూడో తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను కూడా నియమిస్తామని తెలిపారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందజేస్తామని చెప్పారు. పాఠశాలల విలీనంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, దీనిపై ప్రతిప్రక్షాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ప్రజా సమస్యలు ‘ఆంధ్రజ్యోతి’కి మాత్రమే కనబడతాయా..? తమకు తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల విలీనం జరిగేతే అనేక పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉందని మీడియా ప్రస్తావించగా బొత్స సత్యనారాయణ మరింతగా ఆగ్రహించారు.