Face attendance: ‘విద్యా దీవెన’ కావాలంటే...
ABN , First Publish Date - 2022-12-01T11:07:34+05:30 IST
ఇటీవల ఉపాధ్యాయులకు ఫేస్ అటెండెన్స్(ముఖ ఆధారిత హాజరు)(Face attendance) విధానాన్ని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థులకూ అమలు చేస్తోంది. గురువారం నుంచి ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులందరి( students)కీ ఫేస్ అటెండెన్స్ను అమల్లోకి తీసుకొస్తోంది. ముఖ్యంగా డిగ్రీ
నేటి నుంచి విద్యార్థులకు ‘ఫేస్’ అటెండెన్స్
డిగ్రీ కాలేజీలకు ఆదేశాలు.. త్వరలో మిగిలిన వాటికీ
దీని ఆధారంగానే ‘విద్యా దీవెన’
ఉన్నత విద్యలో అమలుకు సిద్ధం
అమరావతి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ఇటీవల ఉపాధ్యాయులకు ఫేస్ అటెండెన్స్(ముఖ ఆధారిత హాజరు)(Face attendance) విధానాన్ని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థులకూ అమలు చేస్తోంది. గురువారం నుంచి ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులందరి( students)కీ ఫేస్ అటెండెన్స్ను అమల్లోకి తీసుకొస్తోంది. ముఖ్యంగా డిగ్రీ కళాశాలలన్నీ వెంటనే దీన్ని అమలుచేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఇంజనీరింగ్, ఫార్మా, బీఈడీ వంటి ఇతర ఉన్నత విద్య కోర్సులన్నిటికీ దశలవారీగా అమలుచేయనున్నారు. దీనికిగాను గత రెండు వారాలుగా డిగ్రీ కళాశాలల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. ఫేస్ అటెండెన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ యూజర్నేమ్, పాస్వర్డ్లను కళాశాలల ప్రిన్సిపాళ్లకు పంపారు. డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకులతో పాటు విద్యార్థుల రిజిస్ర్టేషన్ను పూర్తిచేశారు. ఇటీవల కొత్తగా చేరిన మొదటి సంవత్సరం విద్యార్థులు మినహా దాదాపు అందరినీ ఇందులోకి తీసుకొచ్చారు. విద్యార్థులను ముఖాలను పలు కోణాల్లో ఫొటో క్యాప్చర్ చేశారు. దీంతో తరగతి గదిలో ఈ యాప్ను ఉపయోగించి ఫొటో తీస్తే విద్యార్థుల ముఖాలను యాప్ గుర్తించి హాజరు నమోదు చేస్తుంది. గుర్తించని ముఖాలను ఎర్రర్గా చూపిస్తుంది. అలాంటి వారికి అధ్యాపకులు రెండోసారి రిజిస్ర్టేషన్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా నిమిషాల్లో జరిగిపోయే ప్రక్రియ అని అధికారులు తెలిపారు. తరగతి గదిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా ఒకటి లేదా రెండు ఫొటోలతో హాజరు పడుతుందన్నారు. ఒకవేళ ఫొటో తీసే సమయానికి ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా యాప్లో హాజరు నమోదు అవుతుందని తెలిపారు.
ఇదీ ప్రయోజనం
ఫేస్ అటెండెన్స్ ప్రక్రియ వల్ల విద్యార్థులు లేకుండానే కాలేజీలు నడుస్తున్నాయనే ఆరోపణలు ఉన్న వాటికి అడ్డుకట్ట పడే అవకాశం ఉందని అధ్యాపకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులు రాష్ట్రంలో బీఈడీ చదువుతున్నారు. అసలు ఈ విద్యార్థులు ఎక్కడున్నారో కూడా తెలియకుండానే వారికి పట్టాలు జారీ అవుతున్నాయి. ఇలాంటి కాలేజీల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ హాజరు ఉపయోగపడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.