Vidyakanuka: గురువులకు కొత్త తలనొప్పి
ABN , First Publish Date - 2022-11-24T11:34:33+05:30 IST
జగనన్న విద్యాకానుక (Vidyakanuka) కిట్ల పంపిణీ విషయంలో ప్రధానోపాధ్యాయుల (Headmaster)పై పాఠశాల విద్య అధికారుల ఒత్తిడి పెరిగింది. విద్యాకానుక తీసుకున్న పిల్లల తల్లులందరితో కచ్చితంగా బయోమెట్రిక్(Biometric) నమోదు చేయించాలని
హెచ్ఎంలపై వేలిముద్ర ఒత్తిడి
విద్యాకానుకలో ఇంకా 10 శాతంపైగా పెండింగ్
అనేకచోట్ల వలసలో తల్లిదండ్రులు
వేలిముద్ర వేయించాలంటున్న అధికారులు
కిట్ మొత్తం ఒకేసారి ఇవ్వక.. అనేకసార్లు వేలిముద్రలు
అసహనం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): జగనన్న విద్యాకానుక (Vidyakanuka) కిట్ల పంపిణీ విషయంలో ప్రధానోపాధ్యాయుల (Headmaster)పై పాఠశాల విద్య అధికారుల ఒత్తిడి పెరిగింది. విద్యాకానుక తీసుకున్న పిల్లల తల్లులందరితో కచ్చితంగా బయోమెట్రిక్(Biometric) నమోదు చేయించాలని ప్రతిరోజూ డీఈవోలు ఆదేశాలు జారీచేస్తున్నారు. ఇప్పటికే చాలావరకు బయోమెట్రిక్ నమోదుచేసినా, పనుల కోసం వలస వెళ్లిన తల్లిదండ్రుల బయోమెట్రిక్ దాదాపు 10శాతానికిపైగా పెండింగ్లో ఉన్నాయి. ఉన్నత పాఠశాలల్లో కనీసం 10-20 మంది పిల్లల తల్లిదండ్రుల వేలిముద్రలు పెండింగ్లో ఉన్నాయి. అయితే విద్యా కానుక మొత్తం కాకుండా అందులో కొన్నిటికి మాత్రమే వేలిముద్రలు పెండింగ్ ఉన్నాయి. బ్యాగులు, బెల్టులు, పుస్తకాలు ఒక్కసారిగా ఇవ్వకపోవడంతో ఒక్కో వస్తువు ఇచ్చిన ప్రతిసారీ వేలిముద్రలు వేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివర్లో ఇచ్చిన బూట్ల కోసం మరోసారి వేలిముద్రలు తీసుకున్నారు. మొత్తం విద్యాకానుక ఒకేసారి ఇచ్చి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. ఇప్పుడు రెండో సెమిస్టర్ పుస్తకాల కోసం మళ్లీ వేలిముద్రలు తీసుకుంటున్నారు. ఇలా పదేపదే వేలిముద్ర వేయాల్సి రావడంపై తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వస్తువు కోసం పనులు మానుకుని పాఠశాలల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇక ఉపాధి కోసం వలస వెళ్లిన తల్లిదండ్రుల వేలిముద్రలు ఎలా తీసుకోవాలో హెచ్ఎంలకు అంతుపట్టడం లేదు. అలాగే, కొందరు విద్యార్థులు బంధువుల ఇళ్లలో ఉంటూ చదువుకొంటున్నారు. ఈ విషయాలను హెచ్ఎంలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వేలిముద్రలు వేయించాల్సిందేనని తేల్చిచెబుతున్నారు. గతవారం రోజులుగా ఈ విషయంలో ఒత్తిడి పెంచారు. సాయంత్రంలోగా పూర్తిచేయాలని ప్రతిరోజూ ఆదేశాలు జారీచేస్తున్నారు. వేలిముద్రలు వేయించలేకపోతే కిట్లకు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని ఓ జిల్లాలో డీఈవో హెచ్చరించారు. దీంతో పాఠశాలల్లో వేలిముద్రల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది.
ఇదో కొత్త తలనొప్పి..
విద్యా కానుక కిట్లో బ్యాగు, పుస్తకాలు, బెల్టు, బూట్లు, యూనిఫాం ఇస్తున్నారు. ప్రతి విద్యార్థికీ అన్నీ ఇవ్వాలి. ఒకవేళ కొన్ని మాత్రమే ఇస్తే జేవీకే మొబైల్ యాప్లో ఆ విద్యార్థికి ఇచ్చిన వస్తువుల ఎదురుగా టిక్ చేసి తల్లులతో వేలిముద్ర తీసుకుంటారు. మిగిలిన వస్తువులను పెండింగ్లా చూపుతారు. ఈ కిట్లను పాఠశాల విద్యాశాఖ ఎంఈవో కార్యాలయాల ద్వారా పాఠశాలలకు పంపుతుంది. ఎంఈవోలు అందుబాటులో ఉన్న వస్తువులను పాఠశాలలకు సమానంగా సరఫరా చేస్తారు. ఇలా వచ్చిన వస్తువులను వెంట వెంటనే విద్యార్థులకు ఇవ్వాలి. గతంలో ఒకేసారి పుస్తకాలు ఇచ్చే విధానం ఉండేది. ఇప్పుడు ఒకే పుస్తకంలో తెలుగు, ఇంగ్లిష్లో పాఠాలు ఉండటంతో సెమిస్టర్ల వారీగా ఇస్తున్నారు. విద్యాకానుక కిట్ల పంపిణీ పెద్ద ప్రహసంగా మారింది. ఇప్పటికే హెచ్ఎంలు, ఉపాధ్యాయులపై యాప్ల భారం పెరగ్గా ఇలా వేలిముద్రల వ్యవహారం కొత్త తలనొప్పి అయ్యిందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. విద్యాకానుక వస్తువులన్నీ ఒకేసారి ఇవ్వలేక ఇప్పుడు తమను ఇబ్బంది పెడుతున్నారని వాపోతున్నారు.