మత రాజకీయాలను తిరస్కరించాలి

ABN , First Publish Date - 2022-01-07T06:16:15+05:30 IST

గుంటూరు నగరంలో ఉన్న జిన్నా టవర్ పేరు మార్చాలని బి.జె.పి నాయకులు డిమాండ్ చేయడం సరికాదు. దేశభక్తి పేరుతో మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టి అంతగా పట్టులేని ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయంగా బలపడాలనుకోవడం అనైతికం...

మత రాజకీయాలను తిరస్కరించాలి

గుంటూరు నగరంలో ఉన్న జిన్నా టవర్ పేరు మార్చాలని బి.జె.పి నాయకులు డిమాండ్ చేయడం సరికాదు. దేశభక్తి పేరుతో మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టి అంతగా పట్టులేని ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయంగా బలపడాలనుకోవడం అనైతికం. అసలే కులవిద్వేషాలతో సర్వనాశనమైన రాష్ట్రం అని పేరు మూటగట్టుకునే పరిస్థితి తెచ్చుకున్న ఆంధ్రలో మతపరమైన భావోద్వేగాలు కూడా రాజుకుంటే ఈ రాష్ట్రాన్ని బాగుచేయడానికి భగవంతుడే మానవరూపంలో అవతరించి ధర్మ సంస్థాపన చేయవలసిందే. జిన్నాటవర్ పేరు మార్చినంత మాత్రాన ఆ టవర్ వెనకున్న చరిత్రను ఎవరూ చెరిపి వేయలేరు. 1942లో కొమెరపుడిలో 14మంది స్వతంత్రయోధులకు జీవితఖైదు పడితే లాల్ జాన్ బాషా తాత ఆనాటి హై కోర్ట్ లాయర్ అయిన జిన్నాను సంప్రదించగా, జిన్నా వాళ్ళ తరపున వాదించి వారిని సాధారణ ఖైదీలుగా మార్చారు. దానికి కృతజ్ఞతగానే గుంటూరులో జిన్నాటవర్ ఏర్పాటు చేశారు. నాటి సభలో స్వతంత్ర పోరాటయోధులైన ఉన్నవ లక్ష్మీనారాయణ, కొండా వెంకటప్పయ్య, కాశీనాధుని నాగేశ్వరరరావు వంటి వారు పాల్గొన్నారు. పాకిస్థాన్ కూడా అఖండ భారతంలో భాగమనే విషయం మరచిపోకూడదు. ఆంగ్లేయుల పుణ్యమా అని సరిహద్దు సమస్య ఎలాగూ ఉండనే ఉంది. దేశంలో అంతర్గతంగా కూడా ఉద్రిక్తతలు తెచ్చుకోవడం దేనికి? ‘మతము మత్తుగూర్చు మార్గమ్ము కారాదు, హితముగూర్పవలయు నెల్లరకును, హితము గూర్పలేని మతము మానగవలె’ అని బ్రహ్మం గారు వందల ఏళ్లనాడే హెచ్చరించారు. ఈ దేశంలో సామాన్యులకు మొదటగా కావాల్సింది దారిద్ర్యం నుండి విముక్తులవడం. బి.జె.పి గానీ, మరే పార్టీ గానీ, నిజంగా దేశభక్తులైతే దేశంలోని కులమహమ్మారినీ, దారిద్ర్యాన్నీ తుదముట్టించాలి. ఆర్ధిక అసమానతలు అంతగా లేని సమసమాజాన్ని నిర్మించాలి.

గౌరాబత్తిన కుమార్ బాబు

Updated Date - 2022-01-07T06:16:15+05:30 IST