మతచిహ్నాలకన్నా చదువే ముఖ్యం

ABN , First Publish Date - 2022-02-23T05:54:23+05:30 IST

హిజాబ్‌ ధారణ అంశం మీద కర్ణాటక హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు హిజాబ్‌ గురించి వాదిస్తూ...

మతచిహ్నాలకన్నా చదువే ముఖ్యం

హిజాబ్‌ ధారణ అంశం మీద కర్ణాటక హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు హిజాబ్‌ గురించి వాదిస్తూ, ఇతర మతాల వారి గుర్తులను ప్రశ్నిస్తున్నారు. ఇది శుభ పరిణామం. దేశం సెక్యులర్‌ అయినపుడు ప్రజలందరు తమ తమ మతాలను ఇంటికి మాత్రమే పరిమితం చెయ్యాల్సి ఉంటుంది. పిటిషనర్‌ తరఫున హిందూ అమ్మాయిలు గాజులు వేసుకుని పాఠశాలకు రావటాన్ని ప్రశ్నించారు. అయితే క్రైస్తవ విద్యాసంస్థల్లో హిందూ అమ్మాయిలు గాజులు, బొట్లు, తలలో పూలు పెట్టుకుని స్కూల్‌కు రాకూడదు. పసుపు రాసుకోకూడదు. ఈ విద్యాసంస్థలు అమలుచేసే ఆ నిబంధనలకు లోబడే హిందూ ఆడపిల్లలు అక్కడ చదువుకుంటున్నారు. ఆ మత చిహ్నాలకన్నా చదువు ముఖ్యం అనుకోవడం వల్ల వారు ఆందోళన చెయ్యలేదు. గతంలో ముంబైలోని భారత్‌ విద్యా సొసైటీ వారు హిజాబ్‌ కూడదు అన్నప్పుడు ముస్లిం అమ్మాయిలు ముంబై హైకోర్టును ఆశ్రయించగా స్కూల్‌ విధానాన్ని ఆ కోర్టు సమర్థించింది. స్కూల్‌ యూనిఫాం నిబంధనలు సరైనవేనని 2003లో తీర్పునిచ్చింది. 2018లో కేరళ హైకోర్టు కూడా ఇటువంటి తీర్పునే ఇచ్చింది. స్కూల్‌లో నిర్వహించే స్టూడెంట్‌ పోలీస్‌ ప్రాజెక్ట్‌లో హిజాబ్‌ ధరించి రావడానికి వీలులేదని కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వాటిని కేరళ హైకోర్టు సమర్థించింది. కాబట్టి విద్యాసంస్థలలో యూనిఫాం తప్పనిసరి. యూనిఫాం అనేది సామాజిక, ఆర్థిక అసమానతలు, గుర్తింపులు లేకుండా పిల్లలంతా ఒక్కటేనన్న భావన కల్పించేందుకు రూపొందించినది. మేము అందరిలా కాదు, మా మతం మాకు ముఖ్యం అని ఎవరు వాదించినా దానిని తిరస్కరించాల్సిందే. కర్ణాటక హైకోర్టు కూడా సెక్యులర్‌ భావనకు అనుకూలంగా తీర్పునిస్తుందని ఆశిద్దాం.

డా. దుగ్గరాజు శ్రీనివాసరావు


Updated Date - 2022-02-23T05:54:23+05:30 IST