రాజ్యాంగంపై ప్రమాణం చేయించాలి

ABN , First Publish Date - 2022-02-23T05:53:20+05:30 IST

కోర్టులలో సాక్షులను పిలిచి దేవుని మీద ప్రమాణం చెయ్యమంటారు. ఎవరి దేవుళ్ళ మీద వాళ్ళు దేవునిసాక్షిగా అంతా నిజమే చెపుతాను...

రాజ్యాంగంపై ప్రమాణం చేయించాలి

కోర్టులలో సాక్షులను పిలిచి దేవుని మీద ప్రమాణం చెయ్యమంటారు. ఎవరి దేవుళ్ళ మీద వాళ్ళు దేవునిసాక్షిగా అంతా నిజమే చెపుతాను, అబద్ధం చెప్పను అని ప్రమాణం చేస్తారు. దేవునిమీద నమ్మకం లేని వాళ్ళు మనస్సాక్షిగా ప్రమాణం చేస్తారు. ఇంతకీ వాళ్ళు నిజమే చెప్తున్నారా! కోర్టులలో ఈ మనస్సాక్షిగా అనే దానిని చార్లెస్ బ్రాడ్లా అనే బ్రిటన్ నాస్తికుడు 1850 ప్రాంతంలో మొదటిసారిగా ప్రతిపాదించాడు. ఆయన బ్రిటన్ పార్లమెంటు సభ్యునిగా ప్రమాణం చేసేటప్పుడు దేవుని మీద ప్రమాణం చెయ్యమన్నారు. ఆయనకు దేవుని మీద నమ్మకం లేదు, కాబట్టి మనస్సాక్షిగా ప్రమాణం  చేస్తానన్నాడట. అప్పటికి ఇంకా చట్టం మారలేదు కనుక, దేవుని మీద ప్రమాణం చెయ్యకపోతే సభ్యత్వాన్ని రద్దుచేస్తామంటే, చేసుకోమ్మని చెప్పాడట. సభ్యత్వం రద్దు చేసి, మళ్లీ ఎన్నికపెట్టినా బ్రాడ్లానే గెలిచాడు. మరలా అదే సమస్య. మరోసారి సభ్యత్వం రద్దు చేసి, ఎన్నికపెట్టినా మళ్లీ ఆయనే గెలిచాడు. దీంతో బ్రిటన్ పార్లమెంటు మనస్సాక్షిగా కూడా ప్రమాణం చెయ్యవచ్చు అంటూ కొత్త చట్టం చేసింది. మన దేశంలో కూడా కనిపించని దేవుని మీద కాకుండా మనస్సాక్షిగా ప్రమాణం చేయించవచ్చు. ఇటీవల శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ ఎడిటోరియల్‌లో రాజ్యాంగం అన్నిటికంటే ఉన్నతమైనది, పవిత్రమైనది కనుక ఇక నుంచి కోర్టులలో ప్రమాణం చేయించేటప్పుడు, మతపరమైన గ్రంథాలమీద కాకుండా రాజ్యాంగం మీద ప్రమాణం చేయించాలని కోరటాన్ని అభినందించాలి. సుప్రీంకోర్టు ఈ విషయమై ఆలోచన చెయ్యాలి.

నార్నె వెంకటసుబ్బయ్య

Updated Date - 2022-02-23T05:53:20+05:30 IST