‘లోకాయుక్త’ను విజయవాడలోనే ఏర్పాటు చెయ్యాలి
ABN , First Publish Date - 2022-08-31T07:44:13+05:30 IST
మన రాష్ట్ర రాజధాని అమరావతే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతిలో శంకుస్థాపన చేస్తూ ఢిల్లీ కంటె పెద్ద రాజధానిగా అభివృద్ధి చెందాలి అని ఆకాంక్షించారు....
మన రాష్ట్ర రాజధాని అమరావతే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతిలో శంకుస్థాపన చేస్తూ ఢిల్లీ కంటె పెద్ద రాజధానిగా అభివృద్ధి చెందాలి అని ఆకాంక్షించారు. రాజధానిలోనే అన్ని ముఖ్య కార్యాలయాలు ఉండాలి. కాళ్ళు ఒకచోట, తల ఒకచోట, మొండెం ఒకచోట ఉంటే బాగుండదు కదా!అలాగే రాష్ట్ర ముఖ్య కార్యాలయాలన్నీ కుడా అమరావతి దాని చుట్టుప్రక్కల ఉన్నట్లయితే రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. ఇటీవలి వరకు ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త హైదరాబాద్లో ఉండేది. విజయవాడ లోని బందర్ రోడ్డు లోని ఈ కార్యాలయం ఏర్పాటుచేస్తున్నట్లు గతంలో ప్రకటన వచ్చింది . ఒకసారో రెండుసార్లో ఆ కార్యాలయంలో లోకాయుక్త కార్యకలాపాలు జరిపారు. ఎందుకనో ఏమోగానీ కర్నూలులో నెలకు ఆరు లక్షల అద్దె భవనంలో ప్రస్తుతం లోకాయుక్త కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడ నగరం అన్నింటికీ అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ భవనం కాబట్టి అద్దె చెల్లించనవసరం లేదు. అమరావతిలో కూడా చాలా భవనాలు ఖాళీగా ఉన్నాయి. అలాంటప్పుడు కర్నూలులో అద్దె భవనంలో, అందునా నెలకు ఆరు లక్షల అద్దెతో నడపవలసిన అవసరం ఉన్నదా? ఆ డబ్బు ఇంకొక అవసరానికి ఉపయొగించవచ్చు కదా! అసలే రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందులలో ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనే దేశానికి సంబందించిన అన్ని ముఖ్య కార్యాలయాలు ఉన్నాయి. ఒక పనిమీద దేశ రాజధానికి వెళ్తే అన్ని పనులు చేసుకొని రావచ్చు. అలాగే ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కూడా. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉంటే ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. కనుక మన రాష్ట్రంలో కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అమరావతిలోనే ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
నార్నె వెంకటసుబ్బయ్య