చంపేశారా..? ఆత్మహత్యలా..? ఒకే ఇంట్లో ఆరు మృతదేహాలు..!

ABN , First Publish Date - 2022-11-21T18:43:20+05:30 IST

ఆ వ్యక్తి ఓ చిరు వ్యాపారి.. సిగ్నల్స్, జంక్షన్ల వద్ద స్నాక్స్ విక్రయిస్తుంటాడు. అతనికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. సోమవారం ఉదయం అతను, అతని కుటుంబం ఎంత సేపటికీ బయటకు రాలేదు. అనుమానం వచ్చి చూస్తే..

చంపేశారా..? ఆత్మహత్యలా..? ఒకే ఇంట్లో ఆరు మృతదేహాలు..!

ఆ వ్యక్తి ఓ చిరు వ్యాపారి.. సిగ్నల్స్, జంక్షన్ల వద్ద బస్సులు, ఇతర వాహనాలు ఆగినపుడు స్నాక్స్ విక్రయిస్తుంటాడు. అతనికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. సోమవారం ఉదయం అతను, అతని కుటుంబం ఎంత సేపటికీ బయటకు రాలేదు. చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు బద్దలుగొట్టి లోపల చూస్తే మొత్తం ఆరుగురూ విగత జీవులుగా పడి ఉన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది.

ఉదయ్‌పూర్‌లోని గోగుండా ప్రాంతానికి చెందిన ప్రకాష్ తన భార్య, నలుగురు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. అతని సోదరులు కూడా అక్కడే నివాసం ఉంటున్నారు. ప్రకాష్ స్నాక్స్ విక్రయించి తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం ఉదయం ప్రకాష్, అతని కుటుంబ సభ్యులు ఎంతసేపటికీ ఇంటి నుంచి బయటకు రాలేదు. తలుపు కొట్టినా లోపలి నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో అతని సోదరులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తలుపు బద్దలుగొట్టి ఇంటి లోపలికి ప్రవేశించారు. లోపల ప్రకాష్, అతని భార్య, నలుగురు చిన్న పిల్లలు విగత జీవులుగా పడి ఉన్నారు. మొత్తం ఆరుగురి మృతదేహాలను పోలీసులు పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. ఆర్థిక కారణాల వల్లే కుటుంబంతో సహా ప్రకాష్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. మొదట కుటుంబ సభ్యులను చంపి ఆ తర్వాత ప్రకాష్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుకుంటున్నారు. లేదా ఎవరైనా వారిని హత్య చేశారా? అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.

Updated Date - 2022-11-21T18:44:29+05:30 IST