భర్తకు విపరీతమైన కడుపునొప్పి.. ఆస్పత్రిలో చేర్చిన భార్య.. చనిపోయాక అనుమానంతో డాక్టర్లు రక్త పరీక్ష చేస్తే...
ABN , First Publish Date - 2022-12-05T14:57:44+05:30 IST
ఆ వ్యక్తి కొద్ది రోజులుగా కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు చికిత్స అందించినా అతను కోలుకోలేదు. శరీరంలో ఒక్కో అవయవం విఫలం కావడంతో అతడు ఆస్పత్రిలోనే మరణించాడు. అనుమానం వచ్చిన డాక్టర్లు అతడి రక్తాన్ని పరిశీలించగా షాకింగ్ విషయం బయటపడింది.
ముంబైలోని శాంతాక్రూజ్కు చెందిన ఓ మహిళ దారుణ దురాగతాలు తాజాగా వెలుగు చూశాయి. ఆ మహిళ తన ప్రేమికుడితో కలిసి ఆస్తి కోసం భర్తను హత్య చేసింది. ఆమె తన భర్త ఆహారంలో రోజూ స్లో పాయిజన్ కలుపుతుండేది. చివరకు ఆ వ్యక్తి మరణించాడు. దీంతో పోలీసులు ఆ మహిళను, ఆమె ప్రేమికుడిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు అంతకుముందు అత్తగారిని కూడా ఆమె అలాగే హత్య చేసినట్టు విచారణలో బయటపడింది.
ముంబైకి చెందిన కమల్కాంత్ అనే వ్యక్తి కొద్ది రోజులుగా కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు చికిత్స అందించినా అతను కోలుకోలేదు. శరీరంలో ఒక్కో అవయవం విఫలం కావడంతో అతడు ఆస్పత్రిలోనే మరణించాడు. అనుమానం వచ్చిన డాక్టర్లు అతడి రక్తాన్ని పరిశీలించగా దానిలో పెద్ద మొత్తంలో ఆర్సెనిక్, థాలియం ఉన్నట్టు బయటపడింది. అతడికి ఎవరో ప్రతిరోజూ స్లో పాయిజన్ ఇచ్చినట్టు డాక్టర్లు అనుమానించి పోలీసులకు చెప్పారు. హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు కమల్ కాంత్ భార్య కాజల్ సింగ్ను అదుపులోకి తీసుకుని విచారించారు.
ముందు అబద్ధాలు చెప్పిన కాజల్ తర్వాత నిజాలను బయటపెట్టింది. తాను హితేష్ జైన్తో ప్రేమలో ఉన్నానని, భర్త ఆస్తి కోసం, అతను చనిపోతే వచ్చే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఇద్దరం కలిసి ఈ ప్లాన్ వేశామని ఆమె అంగీకరించింది. ప్రతిరోజూ ఆహారంలో కొద్ది మొత్తంలో విషం కలిపేదాన్నని చెప్పింది. అంతేకాదు.. అంతకుముందు అత్తగారికి కూడా స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేసినట్టు అంగీకరించింది. నిందితులు ఇద్దరినీ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఇద్దరినీ డిసెంబర్ 8 వరకు పోలీసు కస్టడీకి పంపింది.