మొదటి ఇద్దరు భర్తలు ఏమైపోయారు..? మూడో భర్తను ముక్కలుగా చేసిన కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు..!

ABN , First Publish Date - 2022-11-29T17:49:34+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాకర్ హత్య కేసు తరహాలోనే ఢిల్లీలో మరో కేసు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అంజన్ దాస్‌ అనే వ్యక్తిని అతడి భార్య పూనమ్, సవతి కుమారుడు దీపక్ కలిసి హత్యచేసి, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్‌లో దాచి పెట్టారు. విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి.

మొదటి ఇద్దరు భర్తలు ఏమైపోయారు..? మూడో భర్తను ముక్కలుగా చేసిన కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాకర్ హత్య కేసు తరహాలోనే ఢిల్లీలో మరో కేసు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అంజన్ దాస్‌ అనే వ్యక్తిని అతడి భార్య పూనమ్, సవతి కుమారుడు దీపక్ కలిసి హత్యచేసి, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్‌లో దాచి పెట్టారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వారిని అరెస్టు చేశారు. విచారణలో వారు తమ నేరాన్ని అంగీకరించారు. అంతేకాదు విచారణలో భాగంగా పూనమ్ సంచలన విషయాలు బయటపెట్టినట్టు సమాచారం. పూనమ్‌కు అంజన్ దాస్ కంటే ముందే మరో ఇద్దరితో వివాహం జరిగింది.

పూనమ్ స్వస్థలం జార్ఖండ్‌లోని దేవగఢ్. ఆమెకు 13 ఏళ్ల వయస్సులో తొలి వివాహం జరిగింది. బీహార్‌కు చెందిన సుఖ్‌దేవ్ తివారీని వివాహం చేసుకుని ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఏడాది తర్వాత సుఖ్‌దేవ్ పని కోసం ఢిల్లీ వెళ్లాడు. ఆ తర్వాత అతను తిరిగి రాలేదు. భర్తను వెతుక్కుంటూ 1997లో పూనమ్ తన కుమార్తెతో కలిసి ఢిల్లీకి చేరుకుంది. సుఖ్‌దేవ్ తివారీ గురించి అన్ని చోట్లా వెతికింది. ఎక్కడా అతని ఆచూకీ దొరకలేదు. ఇంతలో పూనమ్ జీవితంలోకి త్రిలోక్‌పురికి చెందిన కల్లు ప్రవేశించాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి సహజీవనం ప్రారంభించారు. పూనమ్‌కు కల్లుతో ఉన్న సంబంధం కారణంగా ఒక కుమారుడు దీపక్ (హత్య కేసులో సహ నిందితుడు), ఇద్దరు కుమార్తెలు జన్మించారు. మద్యానికి బానిసైన కల్లు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.

2011లో పూనమ్‌కు తన ఇంటి పై అంతస్తులో నివసించే అంజన్ దాస్‌తో పరిచయం ఏర్పడింది. కాలేయ వైఫల్యంతో 2016లో కల్లు మృతి చెందాడు. ఆ తర్వాత పూనమ్ పూర్తిగా అంజన్‌తో కలిసి జీవించడం ప్రారంభించింది. అంజన్‌కి అప్పటికే వివాహమైంది. అతనికి అప్పటికే ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. పూనమ్‌తో సహజీవనం ప్రారంభించిన తర్వాత అంజన్ పూర్తిగా పని మానేసి ఆమె మీదనే ఆధారపడేవాడు. అంతేకాదు పూనమ్ ఇంట్లో నగలు, డబ్బు దొంగిలించి బీహార్‌లో ఉన్న తన మొదటి భార్య, పిల్లలకు పంపించేవాడు. ఈ విషయమై పూనమ్, అంజన్ మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. కాగా, 2018లో పూనమ్ కొడుకు దీపక్ వివాహం చేసుకున్నాడు. భార్యతో కలిసి దగ్గర్లోనే వేరే ఇంట్లో కాపురం పెట్టాడు.

కాగా, ఇంట్లో ఉంటున్న తన కూతురిపైనా, దీపక్ భార్య పైనా అంజన్ కన్ను పడినట్టు పూనమ్ దృష్టికి వెళ్లింది. ఇద్దరి పైనా అంజన్ అత్యాచారానికి కూడా యత్నించాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లీకొడుకులు పూనమ్, దీపక్ ఎలాగైనా అంజన్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లోనే మద్యం తాగించి అంజన్‌ను హత్య చేశారు. అతడిని ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్‌లో పెట్టి నగరంలోని భిన్న ప్రాంతాల్లో విసిరేశారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు.

Updated Date - 2022-11-29T17:49:35+05:30 IST