ముందుంది ముసళ్ల పండగ
ABN , First Publish Date - 2022-06-12T06:27:53+05:30 IST
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. ధరల (ద్రవ్యోల్బణం) సెగ ఇంకా పూర్తి స్థాయిలో గరిష్ఠ స్థాయికి చేరలేదన్నారు. ప్రస్తుత చమురు ధరలతో ప్రపంచ దేశాల్లో రిటైల్, టోకు ధరల...
ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
వాషింగ్టన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. ధరల (ద్రవ్యోల్బణం) సెగ ఇంకా పూర్తి స్థాయిలో గరిష్ఠ స్థాయికి చేరలేదన్నారు. ప్రస్తుత చమురు ధరలతో ప్రపంచ దేశాల్లో రిటైల్, టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణాలు రెండూ మరింత పెరుగుతాయన్నారు. ఈ మంట చల్లార్చేందుకు ఫెడ్ రిజర్వ్ వంటి ప్రధాన కేంద్ర బ్యాంకులు మరింత దూకుడుగా వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతాయన్నారు. ఎనభయ్యో దశకంతో పోలిస్తే ద్రవ్యోల్బణాన్ని అనేక దేశాలు తక్కువగా చూపిస్తున్నట్టు ఇటీవల ప్రముఖ ఆర్థికవేత్త లారీ సమ్మర్స్ చేసిన వ్యాఖ్యను రాజన్ గుర్తు చేశారు.
అమెరికాలో మళ్లీ మాంద్యం: వచ్చే ఏడాది అమెరికా ఆర్థిక వ్యవస్థ కొద్ది స్థాయిలోనైనా మాంద్యానికి గురవుతుందని రాజన్ స్పష్టం చేశా రు. అమెరికా కంపెనీలు ఇప్పటికే ఉద్యోగుల తొలగింపులకు నడుం బిగించడమే ఇందుకు సూచిక అన్నారు. అయితే ఈ మాంద్యం 2008లో వచ్చిన మాంద్యం అంత తీవ్రంగా ఉండదన్నారు. ప్రజల బ్యాంక్ బాలెన్స్లు బాగుండటం ఇందుకు ప్రధాన కారణమని చెప్పారు.