సుజ్లాన్‌ సీఎండీ తుల్సి తంతి ఆకస్మిక మృతి

ABN , First Publish Date - 2022-10-03T08:32:34+05:30 IST

ప్రముఖ పారిశ్రామికవేత్త, సుజ్లాన్‌ ఎనర్జీ వ్యవస్థాపకుడు, సీఎండీ తుల్సి తంతి (64) గుండెపోటుతో శనివారం సాయంత్రం కన్ను మూశారు.

సుజ్లాన్‌ సీఎండీ తుల్సి తంతి ఆకస్మిక మృతి

న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త, సుజ్లాన్‌ ఎనర్జీ వ్యవస్థాపకుడు, సీఎండీ తుల్సి తంతి (64) గుండెపోటుతో శనివారం సాయంత్రం కన్ను మూశారు. కంపెనీ ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది. శనివారం అహ్మదాబాద్‌లో విలేకరుల సమావేశంలో పాల్గొని పుణెకు తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ‘ఛాతీలో నొప్పిగా ఉంది. వెంటనే నన్ను సమీపంలోని హాస్పిటల్‌కు తీసుకు వెళ్లు’ అని ఆయన తన డ్రైవర్‌ను కోరారు. హాస్పిటల్‌కు తీసుకు వెళ్లేసరికే తంతి  తుది శ్వాస విడిచినట్టు కంపెనీ పేర్కొంది.  దేశంలో పవన విద్యుత్‌కు బాటలు వేసిన తంతికి హరిత ఇంధన నిపుణుడిగా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. తంతి ఆకస్మిక మరణంపట్ల ప్రధాని మోదీ, కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య  శాఖల మంత్రి పీయూష్‌ గోయల్‌ తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. టెక్స్‌టైల్‌ రంగంలో ఉన్న తులసి తంతి 1990 దశకం ప్రారంభంలోనే పునరుత్పాదక ఇంధన రంగంలో ఉన్న  వ్యాపార అవకాశాలను గుర్తించారు. 1995లో సుజ్లాన్‌ ఎనర్జీ  పేరుతో  కంపెనీని ఏర్పాటు చేసి దేశంలోనే పవన విద్యుత్‌ టర్బైన్ల తయారీకి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం దేశంలో ఉన్న స్థాపిత పవన విద్యుత్‌ సామర్ధ్యంలో 33 శాతం (19,200 మెగావాట్లు) సుజ్లాన్‌ సరఫరా చేసిన టర్బైన్ల ద్వారానే ఉత్పత్తి అవుతోంది. అమెరికాకీ సుజ్లాన్‌ కంపెనీ పెద్ద మొత్తలో పవన విద్యుత్‌ టర్బైన్లను సరఫరా చేసింది. ప్రస్తుతం దాదాపు 17 దేశాల్లో సుజ్లాన్‌ ఎనర్జీ టర్బైన్లు వినియోగిస్తున్నారు. 

Updated Date - 2022-10-03T08:32:34+05:30 IST