త్వరలో డిజిటల్ రూపీ
ABN , First Publish Date - 2022-10-08T09:17:33+05:30 IST
దేశంలో డిజిటల్ లావాదేవీలకు మరింత ఊతం లభించనుంది. డిజిటల్ రూపాయి విడుదల చేసేందుకు ఆర్బీఐ సిద్ధమవుతోంది.
‘పరిమిత’ లావాదేవీలకు ప్రయోగాత్మక అనుమతి.. ఆర్బీఐ కాన్సెప్ట్ పత్రం
ముంబై: దేశంలో డిజిటల్ లావాదేవీలకు మరింత ఊతం లభించనుంది. డిజిటల్ రూపాయి విడుదల చేసేందుకు ఆర్బీఐ సిద్ధమవుతోంది. సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) పేరుతో త్వరలోనే దీన్ని ప్రయోగాత్మకంగా విడుదల చేస్తామని తెలిపింది. అయితే ఎపుడు అనే విషయం మాత్రం నిర్దిష్టంగా వెల్లడించలేదు. డిజిటల్ రూపాయికి సంబంధించి శుక్రవారం ఒక ప్రాథమిక విధాన పత్రం విడుదల చేసింది. ఇందులో డిజిటల్ రూపాయి తీరుతెన్నులు, ఉపయోగాల గురించి ప్రస్తావించింది. దీంతో దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటుందని ఆర్బీఐ పేర్కొంది. చెల్లింపుల విధానం మరింత మెరుగుపడి నల్లధనం, అక్రమ నగదు లావాదేవీలకూ చెక్ పడుతుందని తెలిపింది.
‘పరిమిత’ లావాదేవీలకే
డిజిటల్ రూపాయిని ముందు పరిమిత లావాదేవీలకు మాత్రమే అనుమతించనున్నట్టు ఆర్బీఐ తెలిపింది. అయితే ఆ లావాదేవీలు ఏమిటనే విషయం మాత్రం వెల్లడించలేదు. బహుశా వ్యాపార సంస్థల మధ్య (బీ2బీ) బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా జరిగే హోల్సేల్ ఆర్థిక లావాదేవీల చెల్లింపులకు మాత్రమే డిజిటల్ రూపాయిని అనుమతించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే కంపెనీల మధ్య, నల్ల ధనానికి దారితీసే చీకటి ఒప్పందాల దందాకు చెక్ పడినట్టే. బీ2బీతో పాటు వ్యాపార సంస్థలతో వ్యక్తిగత వినియోగదారులు (బీ2సీ) జరిపే రిటైల్ లావాదేవీల చెల్లింపుల కోసం ఆర్బీఐ ప్రత్యేక డిజిటల్ రూపాయి తీసుకు వస్తుందనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.
పేపర్ కరెన్సీ యథాతథం
డిజిటల్ రూపాయి తీసుకొచ్చినా ప్రస్తుత కరెన్సీ నోట్ల చలామణికి ఎలాంటి ఢోకా ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది. డిజిటల్ రూపాయి, ప్రస్తుత కరెన్సీ నోట్లకు అనుబంధ కరెన్సీ తప్ప, వాటిని పూర్తిగా భర్తీ చేసేది కాదని పేర్కొంది.
డిజిటల్ రూపాయి అంటే?
డిఙటల్ రూపాయి కరెన్సీని కూడా ఆర్బీఐనే విడుదల చేస్తుంది. కాగితం కరెన్సీ నోట్లపై ఉండే గుర్తులే ఈ కరెన్సీపైనా ఉంటాయి. ముందు ప్రయోగాత్మకంగా కొన్ని పరిమిత చెల్లింపులకు మాత్రమే దీన్ని అనుమతిస్తారు. తర్వాత అన్ని రకాల చెల్లింపులనూ అనుమతిస్తారు. కాకపోతే ప్రస్తుత కరెన్సీ నోట్లు కాగితం రూపంలో ఉంటే, డిజిటల్ రూపాయి నోట్లు డిజిటల్ రూపంలో ఉంటాయి. ఈ నోట్ల నంబర్లుగానీ, గుర్తులుగానీ మార్చేందుకు ఏమాత్రం అవకాశం ఉండదు. ఇందుకోసం బ్లాక్చెయిన్ టెక్నాలజీ ఉపయోగిస్తారు. దీంతో దొంగనోట్ల ముద్రణకూ చెక్ పడుతుంది. ప్రజలు కరెన్సీ నోట్లు జేబులో పెట్టుకుని బయటికి వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. స్మార్ట్ఫోన్ వాలెట్లోనే డిజిటల్ రూపాయిలు స్టోర్ చేసుకోవచ్చు.