sbi hdfc: రుణగ్రహీతలకు బ్యాడ్న్యూస్ !.. మీపై మరింత భారం..
ABN , First Publish Date - 2022-10-02T21:44:50+05:30 IST
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ (SBI), ప్రైవేటురంగ హెచ్డీఎఫ్సీ (HDFC) కస్టమర్లకు బ్యాడ్న్యూస్.
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ (SBI), ప్రైవేటురంగ హెచ్డీఎఫ్సీ (HDFC) రుణగ్రహీతలకు బ్యాడ్న్యూస్. త్వరలోనే గృహ రుణ (House loans) ఈఎంఐలు (EMIs) మరింత భారం కాబోతున్నాయి. కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) రెపో రేటుని (repo rate) 50 బేసిస్ పాయింట్ల మేర పెంచడంతో అందుకు అనుగుణంగా ప్రధాన ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ కూడా వడ్డీ రేట్లను పెంచాయి.
ఆర్ఎల్ఎల్ఆర్ (రెపో-లింక్డ్ లెండింగ్ రేటు), ఈబీఎల్ఆర్ (ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటు)లను ఎస్బీఐ 50 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో ఎస్బీఐ ఈబీఎల్ఆర్ 8.55 శాతానికి చేరింది. ఇక ఆర్ఎల్ఎల్ఆర్ రేటు 8.15 శాతానికి పెరిగింది. అంటే ఎస్బీఐ ఖాతాదారుల గృహ రుణాలు మరింత ప్రియం కాబోతున్నాయి. 0.50 శాతం మేర పెరుగుదలతో లోన్ బెంచ్మార్క్ని బట్టి నెలవారీ ఈఎంఐల భారం పెరగనుంది. ఈఎంఐలపై ప్రభావం ఏవిధంగా ఉండనుందనేది సిబిల్ స్కోరు, రుణగ్రహీత ప్రొఫైల్, లోన్ టు వ్యాల్యూ రిస్క్, రిస్క్ అసెస్మెంట్, పేమెంట్ ఫెల్యూర్ వంటి అంశాలపై ఆధారపడుతుంది. పెరిగిన వడ్డీ రేట్లు అక్టోబర్ 1, 2022 నుంచే అమల్లోకి వచ్చేస్తాయి.
హెచ్డీఎఫ్సీ రేట్ల పెంపు ఇలా..
ప్రైవేటు రంగ హెచ్డీఎఫ్సీ కూడా ప్రధానమైన ఆర్పీఎల్ఆర్ (రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు)ను 0.50 శాతం మేర పెంచింది. రేట్ల పెంపు అక్టోబర్ 1, 2022 నుంచే అమల్లోకి వచ్చిందని వెల్లడిస్తుంది. నెలవారీ ఈఎంఐల భారం పెరగనుందని హెచ్డీఎఫ్సీ తెలిపింది. కాగా ఇతర బ్యాంకులు కూడా ఎస్బీఐ బాటలో త్వరలోనే రుణ రేట్లను పెంచనున్నాయి.