మార్కెట్లకు ఆర్బీఐ బూస్ట్
ABN , First Publish Date - 2022-10-01T06:51:59+05:30 IST
వరుసగా ఏడు రోజులు నష్టాల్లో పయనించిన భారత స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీగా లాభపడ్డాయి.
సెన్సెక్స్ 1,017 పాయింట్లు అప్
మళ్లీ 17,000 ఎగువకు నిఫ్టీ
ముంబై: వరుసగా ఏడు రోజులు నష్టాల్లో పయనించిన భారత స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీగా లాభపడ్డాయి. ఆర్బీఐ ద్రవ్యపరపతి సమీక్ష నిర్ణయాల ప్రకటన అనంతరం భారీగా పుంజుకున్న బీఎ్సఈ సెన్సెక్స్.. ఏకంగా 1,016.96 పాయింట్లు (1.80 శాతం) పెరిగి 57,426.92 వద్ద ముగిసింది. నిఫ్టీ 276.25 పాయింట్లు (1.64 శాతం) ఎగిసి 17,094.35 వద్ద స్థిరపడింది. ఈసారి సమీక్షలో 0.50 శాతం రెపో పెంపును మార్కెట్ వర్గాలు ముందుగానే ఊహించాయి. అయితే, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, మాంద్యం భయాల నేపథ్యంలోనూ దేశీయంగా వృద్ధి పునరుద్ధరణపై ఆర్బీఐ ధీమా వ్యక్తం చేసింది. ద్రవ్యోల్బణం అంచనాలను యథాతథంగా కొనసాగించడంతోపాటు వచ్చే ఏడాది జనవరి నుంచి ధరలు తగ్గుముఖం పట్టవచ్చన్న ఆర్బీఐ వ్యాఖ్యలు మార్కెట్ ర్యాలీకి దోహదపడ్డాయి. రూపాయి బలపడటమూ మార్కెట్లకు కలిసి వచ్చింది. కొనుగోళ్ల జోరుతో స్టాక్ మార్కెట్ వర్గాల సంపద దాదాపు రూ.4 లక్షల కోట్ల మేర పెరిగి రూ.271.84 లక్షల కోట్లకు చేరుకుంది.
డాలర్తో రూపాయి మారకం రేటు మరో 37 పైసలు బలపడి రూ.81.36 స్థాయికి పరిమితమైంది. వడ్డీ రేట్ల పెంపు రూపాయికి దన్నుగా నిలిచింది.