మార్కెట్లోకి మరిన్ని కార్డియాలజీ ఔషధాలు
ABN , First Publish Date - 2022-09-08T06:57:09+05:30 IST
దేశీయ మార్కెట్లో కార్డియాలజీ, డయాబిటాలజీ విభాగాల్లో మరిన్ని ఔషధాలను విడుదల చేయాలని నాట్కో ఫార్మా భావిస్తోంది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): దేశీయ మార్కెట్లో కార్డియాలజీ, డయాబిటాలజీ విభాగాల్లో మరిన్ని ఔషధాలను విడుదల చేయాలని నాట్కో ఫార్మా భావిస్తోంది. ఈ విభాగాల్లో ఔషధాల పోర్టుఫోలియోను భవిష్యత్తులో విస్తరించనున్నట్లు నాట్కో మేనేజింగ్ డైరెక్టర్ వీసీ నన్నపనేని తెలిపారు. దేశీయ ఫినిష్డ్ డోసేజ్ ఫార్ములేషన్స్ మార్కెట్లో నాట్కో ప్రధానంగా అంకాలజీ, కార్డియాలజీ, మధుమేహ, స్పెషాలిటీ ఫార్మాస్యూటికల్ ఔషధాలను విక్రయిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 14 ఔషధాలను విడుదల చేసింది. కంపెనీ విక్రయాల్లో 23 శాతం దేశీయ మార్కెట్ నుంచి లభిస్తోంది. అంకాలజీ విభాగంలో 2003-04 ఏడాదిలో 6 ఔషధాలను కంపెనీ విక్రయిస్తుండగా.. 2022, మార్చి నాటికి 39 ఔషధాలకు పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది.
భాగస్వామ్యాలకు మొగ్గు: ప్రస్తుతం అమెరికా, కెనడా, బ్రెజిల్ వంటి 50కి పైగా దేశాల్లో ఎఫ్డీఎఫ్ ఔషధాలను నాట్కో విక్రయిస్తోంది. అంతర్జాతీయంగా వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి భాగస్వామ్య ఆధారిత వ్యాపార మోడళ్లను అనుసరించాలని భావిస్తోంది. పరిశోధన, అభివృద్ధి, తయారీ సామర్థ్యాలను పెంచుకోనుంది.
పంటల సంరక్షణ విభాగంలో : ఫార్మా రంగంలో విస్తరించిన విధంగానే పంటల సంరక్షణ ఉత్పత్తుల వ్యాపారంలో కూడా బలమైన పునాదులు వేయాలని నాట్కో నిర్ణయించింది. మార్కెట్లోకి బయో, సాధారణ పెస్టిసైడ్లను విడుదల చేయనుంది.