రూ.250 కోట్లతో మంగళ్ ఇండస్ట్రీస్ కొత్త ప్లాంట్
ABN , First Publish Date - 2022-12-13T04:21:56+05:30 IST
అమరరాజా బ్యాటరీస్ గ్రూప్ అనుబంధ కంపెనీ మంగళ్ ఇండస్ట్రీస్ (ఎంఐఎల్) ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా తేనేపల్లిలో కొత్త యూనిట్ను...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అమరరాజా బ్యాటరీస్ గ్రూప్ అనుబంధ కంపెనీ మంగళ్ ఇండస్ట్రీస్ (ఎంఐఎల్) ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా తేనేపల్లిలో కొత్త యూనిట్ను ఏర్పాటు చేయనుంది. దాదాపు రూ.250 కోట్లతో 2.15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు అమరరాజా గ్రూ ప్ సహ వ్యవస్థాపకుడు జయదేవ్ గల్లా తెలిపారు. ఆటో కాంపోనెంట్లు, మెటల్ ఫ్యాబ్రికేషన్, బ్యాటరీ కాంపోనెంట్లు, స్టోరేజీ సొల్యూషన్లు మొదలైన వ్యాపారాల్లో మంగళ్ ఇండస్ట్రీస్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అమరరాజా బ్యాటరీస్ కట్టుబడి ఉందని.. కొత్త ప్లాంట్ అందుకు నిదర్శనమని జయదేవ్ గల్లా అన్నారు. మూడు దశాబ్దాలుగా చిత్తూరు జిల్లాలో కార్యకలాపాలు నిర్వహిస్తూ.. 15,000 మందికి పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాం. కొత్త ప్లాంట్ ద్వారా మరో 1,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మంగళ్ ఇండస్ట్రీ్సకు ఇప్పటికే 9 తయారీ యూనిట్లు ఉన్నాయని.. వీటిలో 3,000 మంది పని చేస్తున్నారని వివరించారు.
కొత్త ప్లాంట్లో సౌర విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన రంగానికి అవసరమైన పరికరాలను తయారు చేయనున్నట్లు మంగళ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ హర్షవర్థన గౌరినేని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు లభించిన వెంట నే కొత్త ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు.