Bengaluru floods: బెంగళూరు వరదలు తెచ్చిన తంటా.. ఓ టెకీ బృందం ఎక్కడి నుంచి పనిచేస్తోందో తెలుసా..
ABN , First Publish Date - 2022-09-11T18:15:34+05:30 IST
ఇటివల కురిసిన భారీ వర్షాలు బెంగళూరు నగరాన్ని అతలాకుతలం చేశాయి. నీళ్లలో మునిగిన ఇళ్లు..
బెంగళూరు: ఇటివల కురిసిన భారీ వర్షాలు బెంగళూరు(bengaluru floods) నగరాన్ని అతలాకుతలం చేశాయి. నీళ్లలో మునిగిన ఇళ్లు.. రోడ్లపై నిలిచిన నీళ్ల.. సంపన్నులు సైతం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియా(Social media)లో తెగ వైరల్(Viral) అయ్యాయి. ఆ భయానక వరదలు దేశవాసులందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. విదేశీ పత్రికలు సైతం ‘ఇండియన్ సిలికాన్ వ్యాలీ’(Indian sillicon vally) వరదల్లో చిక్కుకుందంటూ కథనాలు ప్రచురించాయి. అంతటి బీభత్సమైన పరిస్థితుల్లో బెంగళూరు వాసుల దుస్థితి వర్ణణాతీతం. ఇక ఐటీ ఉద్యోగులు ఎదుర్కొన్న అవస్థలు అన్నీఇన్నీ కావు. వరదల కారణంగా వర్క్ ఫ్రం హోమ్ని సక్రమంగా నిర్వర్తించలేకపోయారు. ఏదో విధంగా తమ వర్క్ పూర్తి చేసేందుకు నానా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో ఓ ఐటీ బృందం పనిచేసేందుకు ఎంచుకున్న ప్రదేశం వార్తల్లో నిలిచింది.
కాఫీ ఔట్లెట్స్లో కూర్చోని తమ ల్యాప్టాప్స్లో పనిచేసే ఉద్యోగులు లేదా వ్యక్తులను చూడడం కొత్తమీ కాదు. వారి ప్రత్యేక పరిస్థితల కారణంగా అలా చేయక తప్పదు. అయితే బెంగళూరు వరదల కారణంగా ఓ ఐటీ బృందం తాము పనిచేసేందుకు ఎంచుకున్న అసాధారణ ప్రదేశం వార్తల్లో నిలిచింది. వినడానికి కాస్త కొత్తగా అనిపిస్తున్నా.. ఓ కాఫీ దుకాణంలో డెస్క్ టాప్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకుని ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాపీ ఔట్లెట్లోనే పూర్తిస్థాయి ఆఫీస్ సెటప్ని ఏర్పాటు చేసుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. అసాధారణమైన ఈ దృశ్యాలను సాంకేత్ సాహూ అనే ఓ ట్విటర్ యూజర్ షేర్ చేశాడు. దీంతో ఈ ఫొటోలు వైరల్గా మారాయి. థర్డ్ వేవ్ కాఫీ అనే దుకాణంలో కూర్చొని ఉద్యోగులు పనిచేస్తున్నట్టు ఫొటోల ద్వారా స్పష్టమైంది. మోనిటర్, సీపీయూ, మౌస్ ఇలా పూర్తిస్థాయి సెటప్తో ఓ ఉద్యోగి పనిచేస్తుండడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఉద్యోగుల కార్యాలయాలు వరదల్లో చిక్కుకోవడమే ఈ పరిస్థితికి కారణమని ట్విటర్ యూజర్ పేర్కొన్నారు.