వచ్చే ఏడాది ‘ఎస్యూవీ’లోకి హోండా రీ ఎంట్రీ
ABN , First Publish Date - 2022-09-19T06:35:16+05:30 IST
జపాన్ ఆటో దిగ్గజం హోండా.. వచ్చే ఏడాది మళ్లీ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) విభాగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది.
న్యూఢిల్లీ: జపాన్ ఆటో దిగ్గజం హోండా.. వచ్చే ఏడాది మళ్లీ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) విభాగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. భారతీయ వ్యాపారాన్ని మళ్లీ వృద్ధి పథంలోకి చేర్చేందుకు ఈ ఎస్యూవీ విభాగం ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నామని, ఇందులో భాగంగానే 2023లో ఇందులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ తకుయా సుమురా తెలిపారు. ఎస్యూవీ విభాగం ఏటా రెండంకెల వృద్ధిని సాధిస్తూ వస్తుండటంతో తాము కూడా ఇందులో మెరుగైన వాటాను చేజిక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన చెప్పారు.
గతంలో హోండా పోర్టుఫోలియోలో సీఆర్-వీ, బీఆర్-వీ, మొబిలియో పేర్లతో ఎస్యూవీలు ఉన్నాయి. అయితే ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేకపోవటంతో గడచిన కొన్నేళ్లుగా ఒక్కో వాహనాన్ని మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటూ వచ్చింది. ప్రస్తుతం భారత మార్కెట్లో హోండా.. సిటీ, సిటీ ఈహెచ్ఈవీ (హైబ్రిడ్), కాంపాక్ట్ సెడాన్ అమేజ్ను మాత్రమే విక్రయిస్తోంది. గడచిన మూడేళ్లుగా కంపెనీ అంతర్జాతీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చిందని, ఇందులో భాగంగానే భారత్ సహా మరికొన్ని దేశాల్లో కొన్ని ప్లాంట్లను మూసివేయాల్సి వచ్చిందని తకుయా తెలిపారు. మరోవైపు అంతర్జాతీయంగా కంపెనీని పునర్ వ్యవస్థీకరిస్తూ వస్తున్నామని, ప్రస్తుతం ఈ పనులు పూర్తి కావస్తుండటంతో కొత్త ఉత్పత్తులపై దృష్టిని కేంద్రీకరిస్తున్నట్లు చెప్పారు. హోండాకు భారత్ కీలక మార్కెట్గా ఉందని ఆయన అన్నారు. కంపెనీ ఎస్యూవీలపై దృష్టి పెట్టకపోవటంతో 2018-19లో 5.44 శాతంగా ఉన్న హోండా మార్కెట్ వాటా 2021-22 నాటికి 2.79 శాతానికి పడిపోయిందని తకుయా పేర్కొన్నారు.