వెన్నాడిన వడ్డీ రేట్ల భయాలు
ABN , First Publish Date - 2022-10-12T06:49:22+05:30 IST
ప్రపంచ మార్కెట్ల ధోరణికి అనుగుణంగా భారత ఈక్విటీ మార్కెట్ మంగళవారం భారీ నష్టాలతో ముగిసింది.
843 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై: ప్రపంచ మార్కెట్ల ధోరణికి అనుగుణంగా భారత ఈక్విటీ మార్కెట్ మంగళవారం భారీ నష్టాలతో ముగిసింది. మార్కెట్ నష్టాలతో ముగియడం వరుసగా మూడో రోజు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యవిధానాన్ని మరింత కఠినం చేయనున్నాయన్న వార్తలతో పాటు ఉక్రెయిన్లో మరోసారి రష్యా దాడులు ఉధృతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లన్నీ భారీగా ఊగిసలాడాయి. దాని ప్రభావంతో సెన్సెక్స్ 843.79 పాయింట్లు నష్టపోయి 57147.32 వద్ద ముగియగా నిఫ్టీ 257.45 పాయింట్ల నష్టంతో 16983.35 వద్ద ముగిసింది.
రూపాయి 19 పైసలు అప్: ఫారెక్స్ మార్కెట్లో అమెరికన్ డాలర్ మారకంలో రూపాయి 19 పైసలు లాభపడింది. ఆరంభంలో 82.35 వద్ద ప్రారంభమైన రూపాయి 82.32-82.41 మధ్యన కదలాడి చివరికి 82.21 వద్ద ముగిసింది. మరోవైపు దేశీయ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ జోరు కొనసాగుతోంది. ఎఫ్పీఐలు సోమవారం రూ.2139.02 కోట్లు, మంగళవారం 4612.67 కోట్ల విలువ గల షేర్లు విక్రయించినట్టు ఎక్స్ఛేంజీల వద్ద ఉన్న గణాంకాలు తెలుపుతున్నాయి.